న్యూఢిల్లీ : కరోనా కట్టడికి ప్రజలు సత్వరమే వ్యాక్సిన్ వేయించుకోవాలని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ కోరారు. వ్యాక్సినేషన్ తర్వాత కరోనా చికిత్సకు ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి 75 నుంచి 80 శాతం మేరకు తగ్గుతుందని ఇటీవలి అథ్యయనాల్లో వెల్లడైందని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి కొవిడ్-19 బారినపడినా ఆక్సిజన్ సపోర్ట్ అవసరం కేవలం 8 శాతానికి తగ్గుతుందని, ఐసీయూలో చేరాల్సిన ముప్పు కేవలం ఆరు శాతమేనని డాక్టర్ పాల్ పేర్కొన్నారు.
ఇక కరోనా థర్డ్ వేవ్ చిన్నారులపై పెద్దగా ప్రభావం చూపదని, వారిలో కేసులు అరుదుగానే నమోదవుతాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 18 ఏండ్ల లోపు వారిలో సెరోపాజిటివిటీ రేటు 56 శాతం, 18 ఏండ్లు పైబడినవారిలో 63 శాతంగా ఉందని, దీంతో చిన్నారులకు వైరస్ సోకినా స్వల్పంగానే ఉంటుందని సంకేతాలు వస్తున్నాయని చెప్పారు.