న్యూఢిల్లీ: పిల్లల వ్యాక్సినేషన్కు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల సీఎంలతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు, పరిస్థితిని సమీక్షించారు. కరోనా సంక్షోభాన్ని పూర్తిగా అధిగమించలేదని హెచ్చరించారు. చాలా రోజుల తర్వాత స్కూళ్లు తెరుచుకున్నాయని, అయితే మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న సంగతిని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ అర్హత ఉన్న పిల్లలందరికీ సాధ్యమైనంత త్వరగా టీకాలు వేయాలని, వారి టీకా కవరేజీకి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దీని కోసం స్కూళ్లలో ప్రత్యేక టీకా శిబిరాలు నిర్వహించాలని, టీచర్లతోపాటు తల్లిదండ్రులకు దీని గురించి సమాచారం ఇవ్వాలన్నారు.
కాగా, ఇతర దేశాలతో పోల్చితే దేశంలో కరోనా సంక్షోభాన్ని బాగా నియంత్రించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. అయితే మళ్లీ కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదలను ప్రస్తుతం చూస్తున్నామని చెప్పారు. దీంతో కరోనా ఛాలెంజ్ను ఇంకా అధిగమించాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో అలెర్ట్గా ఉండాలని, వైరస్ వ్యాప్తి నియంత్రణకు బహిరంగ ప్రదేశాల్లో తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.