ఉత్తరప్రదేశ్లోని బరేలీ జంక్షన్లో గురువారం రాజధాని ఎక్స్ప్రెస్ ఎక్కబోతున్న ఒక జవాన్ను టీటీఈ (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) కిందకి తోసేశాడు. ఈ ప్రమాదంలో సోను కుమార్ అనే జవాన్ రెండు కాళ్లకు బలమైన గాయాలు అయ్యాయి. దాంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన తెలియడంతో కోపోద్రిక్తులైన ఇతర జవాన్లు రాజధాని ఎక్స్ప్రెస్ను నిలిపి వేసి, టీటీఈను చితకబాదారు. తీవ్రగాయాలు కావడంతో డాక్టర్లు సోను కుమార్ రెండు కాళ్లను తీసేశారు.
సోను కుమార్ లక్నోలో రాజధాని ఎక్స్ప్రెస్ బి8 బోగిలోని థర్డ్ ఏసీలో ఎక్కాడు. అయితే, బరేలీ స్టేషన్లో రైలు ఆగడంతో మంచినీళ్ల కోసం కిందికి దిగాడు. ఆలోపే రాజధాని ఎక్స్ప్రెస్ కదలడంతో పరుగెత్తుతూ రైలు ఎక్కడానికి ప్రయత్నించాడు. అప్పుడు టీటీఈ, అతనికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే టీటీఈ సోను కుమార్ను కిందకు తోసేశాడు. ఈ విషయం తెలియగానే అక్కడి రైల్వే అధికారులు, జీఆర్పీ ఆర్పీఎఫ్ పోలీసులు అక్కడికి చేరుకుని జవాన్లనకు నచ్చజెప్పారు. ఈ సంఘటనతో రాజధాని ఎక్స్ప్రెస్ గంట ఆలస్యంగా బయలుదేరింది.
‘నేను రైలు ఎక్కబోతుంటే టీటీఈ అడ్డుపడ్డాడు. నన్ను దుర్భాషలాడడమే కాకుండా కదులుతున్న రైలు లోంచి నన్ను కిందకి తోసేశాడు. దాంతో, నా రెండు కాళ్లు పోయాయి అని సోను కుమార్ చెప్పాడు.