బాల్లియా: హత్యాయత్నం కేసులో ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ మాజీ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లాపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. తొమ్మిదేండ్ల నాటి హత్యాయత్నం కేసులో ఆనంద్ స్వరూప్తోపాటు ఆయన అనుచరులు నలుగురు నిందితులుగా ఉన్నారు. అప్పట్లో సుధీర్ ఓజా అనే విద్యార్థి నాయకుడిపై ఆనంద్ స్వరూప్ మరో నలుగురు హత్యయత్నం చేశారు.
ఈ కేసు విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి తమకు మినహాయింపునివ్వాలంటూ గతంలో ఐదుగురు నిందితులు చేసుకున్న అభ్యర్థనను MP-MLA court ప్రత్యేక న్యాయమూర్తి హుస్సేన్ అహ్మద్ అన్సారీ తోసిపుచ్చారు. గత నెల 22న నిందితులపై అదనపు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. శుక్రవారం (ఇవాళ) నిందితులు కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాలని గత మంగళవారం ఆదేశాల్లో పేర్కొన్నది.
అయినా, నిందితులు కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఇవాళ విచారణకు హాజరుకాలేదు. దాంతో ఆగ్రహించిన న్యాయమూర్తి నిందితులపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేశారు. 2013, జనవరి 15న బాల్లియాలోని సతీశ్చంద్ర మహావిద్యాలయలో విద్యార్థి నాయకుడు సుధీర్ ఓజాపై కత్తి దాడి జరిగింది.