డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో ప్రవేశపెట్టిన ‘మిషన్ మర్యాద’ కింద ఈ ఏడాది జూలై 15 నుంచి ఇప్పటి వరకు 10,475 మందిపై చర్యలు తీసుకున్నట్లు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. 1,870 మందిని అరెస్టు చేయడంతోపాటు రూ. 19.5 లక్షలకు పైగా జరిమానా వసూలు చేసినట్లు చెప్పారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో గంగా నది ఘాట్ వద్ద కొందరు యువకులు హుక్కా తాగారు. గమనించిన స్థానికులు వారిపై దాడి చేశారు. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్న నేపథ్యంలో మతపరమైన ప్రదేశాల గౌరవాన్ని కాపాడటం, పర్యాటక ప్రదేశాలలో పరిశుభ్రతను ప్రోత్సహించడం లక్ష్యంగా ‘మిషన్ మర్యాద’ను ఉత్తరాఖండ్ పోలీసులు ప్రవేశపెట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన పది వేలకుపైగా మందిపై చర్యలు తీసుకోవడంతోపాటు సుమారు 20 లక్షల వరకు జరిమానాలు వసూలు చేశామని, సుమారు రెండు వేల మందిని అరెస్ట్ చేసినట్లు శనివారం ఒక ప్రకటనలో పోలీసులు తెలిపారు.