Uttarakhand : ఉత్తరాఖండ్లో ఒక ఏనుగు బీభత్స్ం సృష్టించింది. పౌడీ గఢ్వాల్ జిల్లాలోని కోట్ద్వార్ అటవీ ప్రాంతంలోకి వెళ్లిన నలుగురిపై దాడి చేసింది. ఈ సంఘటనలో 48 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. ముగ్గురికి గాయాలు అయ్యాయి. పశువులకు గడ్డి కోసం వెళ్లిన నలుగురు మహిళలపై ఒక అడవి ఏనుగు దాడి చేసింది. ఈ ఘటనలో లక్ష్మి దేవి అనే మహిళ చనిపోయింది. గాయపడ్డ ముగ్గురిని కొట్దావర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ‘నలుగురు మహిళలు పశువులకు గడ్డి తీసుకొచ్చేందుకు అడవిలోకి వెళ్లారు. వాళ్లు గ్వాల్గడ్ లోయలోని ఐదో నంబర్ కంపార్ట్మెంట్ దాడుతుండగా వాళ్లకు ఒక ఏనుగు ఎదురుపడింది. నీళ్లు తాగడం కోసం వచ్చి న ఆ ఏనుగు నలుగురిపై దాడి చేసింది’ అని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ దినకర్ తివారీ తెలిపారు.
ఏనుగు దాడిలో చనిపోయిన లక్ష్మి దేవి కుటుంబానికి రూ.4 లక్షల అందజేస్తామని, గాయపడ్డవాళ్లకు ఆర్థిక సాయం చేస్తామని తివారి వెల్లడించారు. అయితే.. తరచూ ఏనుగులు దాడి చేస్తుండడం పట్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. కోట్ద్వార్ అటవీ ప్రాంతం ఎన్నో ఏళ్లుగా ఏనుగులకు ఆవాసంగా ఉందని దినకర్ అన్నారు. ఏనుగులు నీళ్లు తాగేందుకు వచ్చే దారిగుండా వెళ్లకూడదని చాలాసార్లు గ్రామస్థులను హెచ్చరించినట్టు ఆయన తెలిపారు.