డెహ్రాడూన్: ఉత్తరాఖంలోని జోషిమఠ్ తరహాలోనే మరో రెండు నగరాల్లోనూ ఇండ్లలో పగుళ్లు ఏర్పడుతుతున్నాయి. పుణ్యస్థలమైన జోషిమఠ్లో ఇప్పటికే 678 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇక రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్లోనూ ఇలాంటి పరిస్థితులే కన్పిస్తున్నాయి. రెండు నగరాల్లోని ఇండ్ల గోడలకు పగుళ్లు ఏర్పడి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొన్ని నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. రిషికేశ్-కర్ణప్రయాగ్ రైలు మార్గంలో టన్నెల్ నిర్మాణమే ఇళ్ల పగుళ్లకు కారణమని అనుమానిస్తున్నారు.
పౌరీ, బగేశ్వర్, ఉత్తరకాశీ, తెహ్రీ గర్వాల్, రుద్రప్రయాగ్ జిల్లాల్లో కూడా నిర్మాణాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చాలామంది ఇండ్లను వదిలి వేరే చోటకు వెళ్తున్నారు.
పలు చిన్న చిన్న కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఆయా ప్రాంతాల ప్రజలు తమను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తెహ్రీ జిల్లా నరేంద్రనగర్ నియోజకవర్గంలోని అటాలి గ్రామం వద్ద చేపడుతన్న రిషికేశ్-కర్ణప్రయాగ్ రైల్వే లైన్ సొరంగం నిర్మాణ పనులే పగుళ్లకు ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు.
దీని నిర్మాణం కోసం రాత్రి, పగలు బ్లాస్టింగ్ చేపడుతున్నారని, దీనివల్లనే సమీపంలోని ఇండ్లకు భారీగా పగుళ్లు ఏర్పడుతున్నట్లు చెప్పారు. ఒక్కోసారి రాత్రి సమయంలో ఇండ్లలో ఉండలేక.. స్థానికులు పిల్లలతో సహా రోడ్డుపైకి వస్తున్నారని వాపోతున్నారు.