Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్లోని ఫతేపూర్ పరిధిలో విచిత్ర ఘటన జరిగింది. పెళ్లి వేడుకలో వధువు పెంపుడు కుక్క అరుపు ఆ పెళ్లి ఆగిపోయేందుకు కారణమైంది. అందులోనూ అది లవ్ మ్యారేజ్. పెంపుడు కుక్క అరుపు వధువు, వరుడు తరఫు బంధువుల మధ్య ఘర్షణకు దారితీసి చివరకు పెళ్లి రద్దైంది. ఈ ఘటన ఈ నెల 18, బుధవారం జరిగింది. ఫతేపూర్కు చెందిన ఒక యువతి, ప్రయాగ్రాజ్కు చెందిన మరో యువకుడు రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. దీంతో ఇద్దరూ గత నెలలో ఆర్య సమాజ్లో ప్రేమ వివాహం చేసుకున్నారు.
తర్వాత ఈ విషయం తెలిసి, రెండు కుటుంబాల వాళ్లు పెళ్లికి అంగీకరించారు. ఈ నెల 18న వారి పెళ్లిని ఇరుకుటుంబాల మధ్య గ్రాండ్గా జరపాలని నిశ్చయించారు. దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెళ్లి వేడుక కోసం వరుడి కుటుంబం, బంధువులు ఫతేపూర్ చేరుకున్నారు. పెళ్లి వేడుక ప్రారంభమైంది. వధూవరుడు ఇద్దరూ దండలు మార్చుకున్నారు. అయితే, అప్పుడే ఆ మండపం పక్కనే ఉన్న పెంపుడు కుక్క గట్టిగా అరవడం ప్రారంభించింది. దీంతో ఆ కుక్క దగ్గర ఉన్న వరుడి తరఫు బంధువు ఒకరు దాన్ని కాలితో తన్నాడు. ఇది చూసిన వధువుకు కోపం వచ్చింది. తను పెంచుకునే కుక్కను అలా తన్నినందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వరుడు తరఫు బంధువులు కూడా స్పందించారు. ఆ కుక్క అరుపు, తన్నడం వంటి విషయాల్లో ఇరువైపులా వాగ్వాదం జరిగింది.
ఇది కాస్తా పెద్ద ఘర్షణకు దారితీసింది. వధువు తరఫు బంధువులు, వరుడి తరఫు బంధువులు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ ఘటనలో ఇరువైపులా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. వధువుకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను అదుపు చేశారు. తర్వాత ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు వధువు తరఫు కుటుంబం తెలిపింది. అయితే, పోలీసులు రెండు కుటుంబాల వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. పెళ్లి రద్దు చేసుకునేందుకే వధూవరుల కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. పెళ్లికి సంబంధించి కుదిరిన ఆర్థిక వ్యవహారలపై పెద్దల మధ్య ఒక ఒప్పందానికి వచ్చారు. దీంతో పెళ్లి రద్దు చేసుకున్నారు.