వారణాసి, నవంబర్ 30: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో దిగ్భ్రాంతికర సంఘటన జరిగింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ తల్లి శవంతో ఏడాదిపాటు నివసించారు. అయితే గత వారం రోజులుగా ఆ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ బయటకు రాకపోవడంతో పొరుగువారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం ఆ ఇద్దరు మహిళల తల్లి గత ఏడాది డిసెంబర్లో చనిపోయారు. కానీ ఆమె కూతుళ్లిద్దరూ తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించకుండా తమ ఇంట్లోనే ఒక గదిలో ఉంచి తాళం వేశారు. అయితే వారం నుంచి మృతురాలి కూతుళ్లిద్దరూ బయటకు రాకపోవడంతో పొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా కుళ్లిపోయిన శవం పక్కన ఆమె కూతుళ్లిద్దరూ కూర్చొని కనిపించారు.