న్యూఢిల్లీ: ఢిల్లీలో నిక్కీ యాదవ్ అనే యువతి హత్య కలకలం రేపింది. వేరే యువతిని పెండ్లి చేసుకుంటున్నాడని తెలిసి అభ్యంతరం చెప్పినందుకు.. సాహిల్ గెహ్లాట్ అనే వ్యక్తి తనతో సహజీనం చేస్తున్న యువతినే హతమార్చాడు. ఈ హత్యపై మృతురాలి తండ్రి మాట్లాడుతూ.. తన కుమార్తెను చంపిన వాడిని చచ్చేవరకు ఉరి తీయాలని డిమాండ్ చేశాడు. నా కుమార్తె హత్య విషయం తనకు మంగళవారం తెలిసిందని చెప్పాడు. అంతకుముందు తమ బిడ్డను తమ కుటుంబాన్ని కలిసి నెలన్నర అయ్యిందని తెలిపాడు.
‘నా కుమార్తెను చంపిన వాడిని చచ్చేవరకు ఉరితీయాలి. నా బడ్డి హత్య వార్త మాకు నిన్ననే (మంగళవారం) తెలిసింది. ఆమె మా కుటుంబాన్ని చివరిసారి కలిసి నెలన్నర అయ్యింది’ అని మృతురాలి తండ్రి బుధవారం ఉదయం మీడియా ముందు విలపిస్తూ చెప్పాడు. కాగా, హర్యానా రాష్ట్రం ఝజ్జర్కు చెందిన 25 ఏండ్ల యువతి నిక్కీ యాదవ్ను ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తే మొబైల్ ఫోన్ కేబుల్ వైర్తో ఉరిబిగించి హత్య చేశాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. సాహిల్ గెహ్లాట్ అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నాడు.
నిక్కీ యాదవ్తో సహజీవనం చేస్తున్న సాహిల్ గెహ్లాట్ మరో యువతిని వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడని, ఈ విషయం తెలుసుకున్న నిక్కీ యాదవ్.. సాహిల్ గెహ్లాట్ను కలిసి నిలదీసిందని, దాంతో ఆగ్రహానికి లోనైన సాహిల్ గెహ్లాట్ కారులోనే ఆమె మెడకు మొబైల్ కేబుల్తో ఉరి బిగించి హత్య చేశాడని, అనంతరం ఆమె మృతదేహాన్ని కారులో దాబాకు తరలించాడని, ఆ దాబాలోని రిఫ్రిజిరేటర్లోనే ఆ మృతదేహాన్ని దాచేశాడని వెల్లడించారు. సమాచారం అందిన తర్వాత తాము దాబా నుంచే మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.