Goa| మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ అగ్రనేత దేవేంద్ర ఫడ్నవీస్ పనాజీ సీటు విషయంలో చేసిన వ్యాఖ్యలు గోవా బీజేపీలో కాక రేపుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పర్రీకర్ కుమారుడు ఉత్పల్ పర్రికర్ విషయంలో దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం పర్రీకర్ కుమారుడు ఉత్పల్ పర్రీకర్ బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వ్యక్తిత్వం, సమగ్రత ఈ రెండు అంశాలపై బీజేపీకి నమ్మకం ఉందా? అంటూ సూటిగా ప్రశ్నించారు. నేర చరిత్ర ఉన్నవారికి టిక్కెట్ ఎలా ఇస్తారని, అభ్యర్థి వ్యక్తిత్వాన్ని అసలు బీజేపీ పరిగణనలోకి తీసుకుంటుందా? అంటూ నిప్పులు చెరిగారు. అభ్యర్థి ఎన్ని తప్పులు చేసినా, మిన్నకుండి పోవడం బీజేపీ లక్షణమా? అలాంటి వారికి టిక్కెట్లిస్తే మేం ఇంట్లోనే చూస్తూ కూర్చుండిపోవాలా? అంటూ ఉత్పల్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
గతంలో తన తండ్రితో పనిచేసిన బీజేపీ సీనియర్లు ఇప్పుడు ప్రచారంలో తనకు ఎంతో మద్దతుగా నిలుస్తున్నారని, కావాల్సినంత ప్రచారం కూడా చేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీలో నేను చాలా చిన్న కార్యకర్తను. దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి పెద్ద నేతలు చేసిన కామెంట్లపై నేను స్పందించలేను. ఒక్క మనోహర్ పర్రీకర్ కుమారుడనన్న సాకుతోనే టిక్కెట్ అడగాలనుకుంటే గతంలోనే అడిగేసేవాడ్ని అంటూ వ్యాఖ్యానించారు. పనాజీ నుంచి అటానాసియో మోన్సరేట్కు టిక్కెట్ ఇస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. గోవాలో జరుగుతున్న రాజకీయ తంతును ఏమాత్రం ఉపేక్షించనని ఉత్పల్ మండిపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవని పెదవి విరిచారు.
గోవాలోని పణాజీ సీటును మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ కుమారుడు ఉత్పల్ పరీకర్ ఆశిస్తున్నారు. ఇప్పటికే ప్రచారాన్ని కూడా చేసుకుంటున్నాడు. అయితే బీజేపీ అధిష్ఠానం ఆయనకు ఝలక్ ఇచ్చింది . ఉత్పల్కు బదులు అటానాసియో మోన్సరేట్కు టిక్కెట్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. ఇదే విషయంపై గోవా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గౌరవ్ ఉత్పల్ డిమాండ్ను తోసిపుచ్చారు. మాజీ సీఎం కుమారుడు అయినంత మాత్రాన పార్టీ టిక్కెట్ ఇచ్చేయాలా? అర్హత ఉన్న వారికే తమ పార్టీ టిక్కెట్ ఇస్తుంది అంటూ ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.