Goa Elections : తాను పణాజీ నుంచి గెలుపొందినా సరే, తిరిగి బీజేపీలో చేరే ప్రసక్తే లేదని గోవా మాజీ సీఎం కుమారుడు ఉత్పల్ పర్రీకర్ తేల్చి చెప్పారు. తన పోటీ కేవలం బీజేపీకి వ్యతిరేకంగా మాత్రమేనని, ఏ ఇతర పార్టీకి వ్యతిరేకం కానే కాదని కుండబద్దలు కొట్టారు. ఉత్పల్ పర్రీకర్ గురువారం పణాజీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు రెండు, మూడు సీట్లలో పోటీ చేయమని బీజేపీ ఆఫర్ చేసిందంటూ సీఎం ప్రమోద్ సావంత్ అంటున్నారని, పణాజీ నుంచి కూడా బరిలోకి దిగమని తనకు ఆఫర్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. పణాజీ టిక్కెట్ కళంకితుడిడే ఇవ్వాలని బీజేపీ నిర్ణయించుకుందని ఎద్దేవా చేశారు. బబూష్ను తాను ఓడిస్తానని, పణాజీ ప్రజలు తనతోనే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. పణాజీ అభివృద్ధి కోసం తాను కృషి చేస్తానని ప్రజలకు ఉత్పల్ హామీ ఇచ్చారు.