న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దాపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంకర్ మండిపడ్డారు. (Jagdeep Dhankhar raps Raghav Chadha) చేతితో సంజ్ఞలు వద్దని, నోటితో మాట్లాడాలంటూ మందలించారు. చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉందంటూ చురక వేశారు. లోక్సభలో బుధవారం జరిగిన భద్రతా ఉల్లంఘనపై చర్చించాలని విపక్షాలు రాజ్యసభలో శుక్రవారం డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా సభలో గందరగోళం చెలరేగింది. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పాయింట్ ఆఫ్ ఆర్డర్ను లేవనెత్తుతూ చేతితో సైగలు చేశారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ఆయనకు ఘటుగా వార్నింగ్ ఇచ్చారు. చేతిలో సైగలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘మిస్టర్ చద్దా, పాయింట్ ఆఫ్ ఆర్డర్ని లేవనెత్తడానికి మీరు ఇలా (చేతి సంజ్ఞ) చేయనవసరం లేదు. మీ నాలుకను ఉపయోగించండి. మరోసారి ఇలా చేయవద్దు’ అని అన్నారు.
కాగా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను జగదీప్ ధంకర్ మరింత మందలించారు. ‘ఏదైనా చెప్పాలనుకుంటే నోరు వాడండి. చేతులతో సైగ చేయవద్దు. ఇప్పుడు చాలా విషయాలు నేర్చుకునే సమయం మీకు వచ్చింది. మీరు త్వరలో డ్యాన్స్ కూడా చేయడం ప్రారంభిస్తారని తెలుస్తోంది. మీ సీటు వద్ద నిశ్శబ్దంగా కూర్చోండి. మీరు ఇప్పటికే ఈ సభ ద్వారా శిక్షకు గురయ్యారు’ అని వ్యాఖ్యానించారు.
మరోవైపు ఈ ఏడాది ఆగస్టులో పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా తప్పుదోవ పట్టించే విషయాలను మీడియాకు అందించినందుకు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఆ ఆరోపణలపై విచారణకు ఆయన హాజరు కావడంతో డిసెంబర్ 4న ఒక తీర్మానం ద్వారా సస్పెన్షన్ను ఎత్తివేశారు.