న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: అమెరికా వీసాల కోసం ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న భారతీయులకు మన దేశంలోని అమెరికా రాయబార కార్యాలయం శుభవార్త చెప్పింది. వెయిటింగ్ పీరియడ్ను తగ్గించేందుకు నిబంధనలు మార్చినట్టు పేర్కొన్నది. భారతీయులు ఇతర దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి అమెరికా ఎంబసీల్లో కూడా వీసా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఉదాహరణకు అమెరికా వీసా కోసం ఏడాది క్రితం దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్న ఓ భారతీయ విద్యార్థి, ఏదైనా పని ఉండి థాయ్లాండ్ వెళ్లాడని అనుకొందాం. అక్కడ ఉన్న అమెరికా ఎంబసీలో కూడా తన వీసా కోసం ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
మనదేశం నుంచి వీసా దరఖాస్తులు భారీగా వస్తుండటంతో వెయిటింగ్ పీరియడ్ కూడా సుదీర్ఘంగా ఉంటున్నది. కొన్నాళ్లక్రితం వెయ్యి రోజులు ఉన్న వెయిటింగ్ పీరియడ్, ఇటీవల 500 రోజులకు తగ్గింది. అంటే ఒక విద్యార్థి లేదా ఉద్యోగార్థి అమెరికా వీసా కోసం దాదాపు రెండు సంవత్సరాలు ఎదురుచూడాల్సి వస్తున్నది. ఇంతటి సుదీర్ఘ వెయిటింగ్ పీరియడ్ ఏ దేశానికీ లేదు. ‘మీరు త్వరలో విదేశీ పర్యటన చేయబోతున్నారా? అయితే మీరు వెళ్లే దేశంలోని అమెరికా ఎంబసీ లేదా కాన్సులేట్లో అమెరికా వీసా కోసం ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ పొందవచ్చు. బీ1, బీ2 వీసాల కోసం భారతీయులకు థాయ్లాండ్ వంటి దేశాల్లో ఈ సౌకర్యం కల్పిస్తున్నాం’ అని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.