రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం లోక్సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్రంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానంతో సహా పలు విధానాలు అత్యంత లోపభూయిష్టమైనవని మండిపడ్డారు. చైనాను, పాక్ను వేరుచేయడం భారత్ వ్యూహాత్మక లక్ష్యంగా వుండాలని, కానీ మోదీ ఆ రెండు దేశాలను కలిపేస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. అయితే ఈ విషయంపై అమెరికా విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. పాక్, చైనా విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఎంత మాత్రమూ ఆమోదనీయం కావని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ప్రైజ్ అన్నారు.
చైనా, పాక్ సంబంధాలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ చేసిన కామెంట్స్పై స్పందించాలని నెడ్ప్రైజ్ను మీడియా కోరగా ఆయన పై విధంగా స్పందించారు. ‘రాహుల్ చేసిన వ్యాఖ్యలను చైనా, పాకిస్తాన్కే వదిలేస్తున్నాం. అయితే తాము మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించం.’ అని నెడ్ప్రైజ్ స్పష్టం చేశారు. అయితే ప్రపంచ యవనికలో ఏ దేశం ఎవరితో సంబంధాలు నెరపాలన్నది తాము నిర్దేశించమని, అమెరికా, చైనా చుట్టే తిరగమని తామేమీ చెప్పమని ఆయన పేర్కొన్నారు. ఎవరి ఎవరికి మద్దతివ్వాలన్నది అది వారి వారి ఛాయిస్ అని, అయితే అమెరికాకు మద్దతివ్వని దేశాలతో మాత్రం తాము సత్సంబంధాలను నెరిపే ప్రసక్తే లేదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ప్రైజ్ తేల్చి చెప్పారు.