న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మర్కో రూబియో శనివారం సమావేశమయ్యారు. భారత్-అమెరికాల మధ్య వివిధ రంగాల్లో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారం, పురోగతిపై ఇద్దరు నేతలు చర్చించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం(పీఎంవో) ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరపున త్వరలో వైట్హౌస్ను సందర్శించాల్సిందిగా ప్రధాని మోదీని రూబియో ఆహ్వానించారు. సమావేశం అనంతరం ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా ఈ భేటీకి సంబంధించిన వివరాలు తెలిపారు. ‘భారత్- అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న పురోగతిపై, ప్రపంచ శాంతి భద్రతలపై చర్చించామని, ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్, అమెరికా కలిసి పని చేస్తూనే ఉంటాయి’ అని పేర్కొన్నారు. రక్షణ, వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, అనుసంధానం, విద్య, ప్రజల మధ్య సంబంధాలు తదితర రంగాలలో భారత్- అమెరికా సహకారంపై రూబియో ప్రధానికి వివరించినట్లు పీఎంవో తెలిపింది. పశ్చిమాసియా పరిస్థితి సహా వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని రూబియో ప్రధానికి తెలిపారు.