Arunachal clash | అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో డిసెంబర్ 9వ తేదీన చైనా ఆర్మీని భారత సైనికులు అడ్డుకున్న విషయం తెలిసిందే. భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు వచ్చిన పీఎల్ఏ దళాల్ని మన సైనికులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఆ అంశం గురించి పార్లమెంట్లో కేంద్రం ప్రకటన కూడా చేసింది. కాగా, భారత్-చైనా ఘర్షణపై అగ్రరాజ్యం అమెరికా తాజాగా స్పందించింది.
వాస్తవాధీనరేఖ వద్ద నెలకొన్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘భారత్-చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వద్ద పరిణామాలను మా రక్షణ శాఖ జాగ్రత్తగా గమనిస్తోంది. సరిహద్దుల్లో చైనా.. తమ దళాలను మోహరించింది. పలు నిర్మాణాలు చేపడుతోంది. ఉద్రిక్తతలు తగ్గించే విషయంపై భారత్ తీసుకుంటున్న చర్యలకు పూర్తి మద్దతు ఇస్తున్నాం’ అని పేర్కొంది.
అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో భారత భూభాగంలోకి చొరబడేందుకు చైనా బలగాలు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ అంశం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను రాజేసింది. గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా మరోసారి దుస్సాహసానికి తెగబడటం రాజకీయంగానూ దుమారం రేపింది. ఈ నెల 9న ఇరుదేశాల బలగాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు వచ్చిన పీఎల్ఏ దళాల్ని మన సైనికులు తిప్పికొట్టారు. ఘర్షణకు సంబంధించి వాస్తవధీన రేఖ సమీపంలోని 17 వేల అడుగుల పర్వతం కేంద్ర బిందువుగా ఉన్నది. భారత సైన్యానికి గట్టి పట్టు ఉన్న ఈ పర్వత ప్రాంతంపై నియంత్రణ సాధించేందుకు చైనా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నది. ముందస్తు ప్రణాళికలో భాగంగానే చైనా బలగాలు భారత్ భూభాగంలోకి చొరబడ్డాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.