న్యూఢిల్లీ : వచ్చేనెలలో జరిగే జీ20 సదస్సుకు ఆతిధ్యం ఇచ్చేందుకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. అతిధులు, ప్రతినిధుల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు బస కోసం ఢిల్లీలోని హోటళ్లను బుక్ చేశారు. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలోని 30కిపైగా హోటళ్లలో పలు దేశాధినేతలు, ప్రతినిధులకు రూంలను బుక్ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఐటీసీ మౌర్య షెరటాన్లో బస చేస్తుండగా, తాజ్ ప్యాలెస్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆతిధ్యం అందుకోనున్నారు.
ఢిల్లీలో 23 హోటళ్లు, ఎన్సీఆర్లో 9 హోటళ్లు జీ20 ప్రతినిధులకు ఆతిధ్యం ఇవ్వనున్నాయి. ఢిల్లీలోని ఐటీసీ మౌర్య, తాజ్ మాన్సింగ్, తాజ్ ప్యాలెస్, హోటల్ ఓబెరాయ్, హోటల్ లలిత్, ది లోధి, లి మెరిడియన్, హ్యాత్ రీజెన్సీ, షంగ్రి-ల, లీలా ప్యాలెస్, హోటల్ అశోక, ఈరోస్ హోటల్, ది సూర్య, రాడిసన్ బ్లూ ప్లాజా, జేడబ్ల్యూ మారియట్, షెరటాన్, ది లీలా యాంబియెన్స్ కన్వెన్షన్, హోటల్ పుల్మన్, రోసెట్టి హోటల్ అండ్ ఇంపిరీయా హోటళ్లు ప్రతినిధుల కోసం ముస్తాబవగా ఎన్సీఆర్ ప్రాంతంలోని ది వివాంటా, ఐటీసీ గ్రాండ్, తాజ్ సిటీ సెంటర్, హ్యాత్ రీజెన్సీ, ది ఓబెరాయ్, వెస్ట్ఇన్, క్రౌన్ ప్లాజా హోటళ్లు జీ20 ప్రతినిధుల కోసం సిద్ధమయ్యాయి.
ఇక జో బైడెన్ బస చేసే ఐటీసీ మౌర్య హోటల్లో ప్రతి ఫ్లోర్లో అమెరికన్ సీక్రెట్ సర్వీస్ కమాండోలు పహారా కాస్తారు. ఈ హోటల్లోని 14వ అంతస్తులో జో బైడెన్ ఉంటారు. ఈ ఫ్లోర్కు చేరుకునేందుకు ప్రత్యేక లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నారు. బైడెన్ విడిది చేస్తున్న హోటల్లో ప్రతినిధులు, అతిధుల కోసం ఏకంగా 400 రూమ్లు బుక్ చేశారు. మరోవైపు బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ షంగ్రి-ల హోటల్లో బస చేయనుండగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయల్ మ్యాక్రన్ క్లారిడ్జెస్ హోటల్లో ఆతిధ్యం స్వీకరిస్తారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఇంపీరియల్ హోటల్లో, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తాజ్ ప్యాలెస్ హోటల్లో బస చేయనున్నారు. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఇప్పటికే ఆయా దేశాలకు చెందిన బృందాలు ఢిల్లీ చేరుకున్నాయి. కాగా సెప్టెంబర్ 9 నుంచి రెండు రోజుల పాటు జీ20 సమావేశాలు జరగనున్నాయి.
Read More :