Modi-Biden Meet | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 24న ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. క్వాడ్ దేశాల సదస్సు సందర్భంగా వచ్చే శుక్రవారం నాడు ఇరువురు నేతలు భేటీ అవుతారని వైట్ హౌస్ సోమవారం ప్రకటించింది. జపాన్ ప్రధాని యోషిహిడే సుగతోనూ బైడెన్ విడిగా చర్చిస్తారు.
భారత్, జపాన్ దేశాల ప్రధానులతో బైడెన్ వేర్వేరు భేటీల తర్వాత ఇండో-పసిఫిక్ రీజియన్ పరిధిలో పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికాలతో కలిపి అవుకుస్ (ఏయూకేయూఎస్) కూటమి ఏర్పాటుపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మొర్రిసన్ అదే రోజు ఆలస్యంగా క్వాడ్ సదస్సులో పాల్గొంటారు. అవుకుస్ కూటమి దేశాల మధ్య టాప్ టైర్ మిలిటరీ టెక్నాలజీ బదిలీతోపాటు మిలిటరీ అలయెన్స్ ఏర్పాటు కానున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు భారత్ రష్యా, ఫ్రాన్స్లతో రక్షణ రంగ ఒప్పందాలు చేసుకుంటుండటం గమనార్హం.