న్యూఢిల్లీ, జూన్ 27: 25 కోట్ల డాలర్ల లంచం కేసులో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, ఇతరులపై క్రిమినల్ అభియోగాలను తక్షణమే ఉపసంహరించుకోవడానికి న్యాయ శాఖ(డీవోజే)కు అనుమతి ఇవ్వడానికి అమెరికా ఫెడరల్ కోర్టు నిరాకరించింది. అలా చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన వివరణ సంక్షిప్తంగా, నిస్సారంగా, నిర్ధారణాత్మకంగా ఉందని కోర్టు తేల్చింది. 8 మంది నిందితులపై ఉన్న అభియోగాన్ని కొట్టి వేయాలని కోరడానికి గల కారణాలను తెలియచేయాలని న్యూయార్క్ తూర్పు డిస్ట్ట్రిక్ట్ కోర్టు జడ్జి నికోలస్ జీ గరౌఫిస్ న్యాయ శాఖను ఆదేశించారు.
అభియోగ పత్రాన్ని శాశ్వతంగా కొట్టివేయాలని కోరడానికి గల ప్రతి కారణాన్ని, అలాగే ఆయా కారణాలకు తగిన వాస్తవ ఆధారాలను ప్రభుత్వం సమర్పించాలని న్యాయస్థానం పేర్కొంది. ఈ సంవత్సరం జూలై 13 లోగా తన వివరణను దాఖలు చేయాలని న్యాయశాఖను న్యాయమూర్తి ఆదేశించారు. 18(ఏ) నిబంధన కింద గౌతమ్ అదానీ అమెరికా ప్రభుత్వం కోర్టును ఆశ్రయించిన తర్వాత ఈ ఉత్తర్వు వెలువడింది.
12 గిగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఈ అభియోగ పత్రం దాఖలైంది. దాని ప్రకారం ఆ ప్రాజెక్టు, దానికి సంబంధించిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఆర్థికంగా ఆచరణ సాధ్యం కావాలంటే రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ సరఫరా ఒప్పందాలను కుదుర్చుకోవడం అవసరంగా ఉండేది. ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు భారత్లోని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చేలా గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్, రంజిత్ గుప్తా, ఇతరులు ఒక ప్రణాళికను రూపొందించారని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులకు మాత్రం రూ.2,029 కోట్ల లంచాలు ఇస్తామని హామీ ఇచ్చారని ఆరోపించారు.