చండీఘడ్: అమెరికాకు చెందిన వ్యాపారవేత్త, దాత దర్శన్ సింగ్ దలీవాల్ను ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు వరించింది. విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ఇస్తుంది. పాటియాలాకు చెందిన దలీవాల్కు.. ఇవాళ ఇండోర్ నగరంలో జరిగిన వేడుకలో అవార్డును ప్రదానం చేశారు. ప్రధాని మోదీ 17వ ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
భారత్తో పాటు ఇతర దేశాల్లో దలీవాల్ అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారు. దాతృత్వానికి ఆయన పెట్టింది పేరు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న రైతులకు మద్దతు ఇచ్చేందుకు ఇండియా వస్తున్న సమయంలో ఆయన్ను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్న విషయం తెలిసిందే.
ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘూ బోర్డర్ వద్ద ధర్నా చేసిన రైతులకు ఆయన లంగర్ ఏర్పాటు చేశారు. అమెరికాలో దలీవాల్ ఇంధన వ్యాపారంలో ఉన్నారు. ఆయనకు 11 రాష్ట్రాల్లో సుమారు వెయ్యి వరకు గ్యాస్ స్టేషన్లు ఉన్నాయి. బిలియన్లు ఆర్జిస్తున్న ఆయన .. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.