చెన్నై : మద్యానికి బానిసైన ఓ భర్త తన స్నేహితుడితో కలిసి భార్యపై దాడి చేశాడు. ఈ ఘటనను ఆమె కూతురు వీడియో తీసి.. పోలీసులకు పట్టించేలా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
తమిళనాడులోని కన్యకుమారికి చెందిన అనిష్, గిరిజా దంపతులకు ముగ్గురు కుమార్తెలు. లాక్డౌన్లో ఈ దంపతులు ఉపాధి కోల్పోయారు. పని లేకపోవడంతో భర్త అనిష్ తాగుడుకు బానిసయ్యాడు. ఇక తన ఫ్రెండ్స్ను ఇంటికి పిలిపించుకుని, భార్య, పిల్లల ముందే మద్యం సేవించడం ప్రారంభించాడు. భర్త ఆగడాలను భార్య అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. తనను అడ్డుకుంటే చంపేస్తానని ఆమెను బెదిరించాడు భర్త. గత వారం అనిష్ తన స్నేహితుడు సుజిన్ను ఇంటికి పిలిచి మద్యం సేవించాడు. ఆ సమయంలో భార్య గిరిజా వారిని నిలదీసింది.
కోపంతో ఊగిపోయిన ఆ ఇద్దరు మగాళ్లు.. గిరిజాపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ దెబ్బలను చూడలేని గిరిజా పెద్ద కూతురు.. తల్లి సెల్ ఫోన్లో ఆ దృశ్యాలను చిత్రీకరించింది. తమ తల్లిని వేధిస్తే ఈ వీడియోను పోలీసులకు చూపిస్తానని కూతురు తండ్రిని బెదిరించింది. మొత్తానికి ఈ వీడియో స్థానికంగా ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయింది. పోలీసుల దాకా ఈ వీడియో చేరింది. గిరిజా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనిష్, సుజిన్ను పోలీసులు అరెస్టు చేశారు.