న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: పెండ్లయినా, కాకపోయినా అబార్షన్ చేయించుకొనే హక్కు మహిళలకు ఉన్నదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. గర్భం దాల్చినప్పటి నుంచి 24 వారాలలోపు వరకు గర్భాన్ని తీయించుకోవచ్చునని తెలిపింది. వైద్య సంబంధ గర్భస్రావ చట్టానికి (ఎంటీపీ) సంబంధించిన ఓ కేసుపై గురువారం విచారణ చేపట్టిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం.. గర్భం తొలగింపులో వివాహితలు, అవివాహితలు అన్న తేడా చూపించటం రాజ్యాంగానికి విరుద్ధమని వెల్లడించింది. ‘ఎంటీపీ చట్టం ప్రకారం మహిళలందరికీ సురక్షితంగా గర్భం తీయించుకొనే హక్కు ఉన్నది. పెండ్లి కానందున గర్భాన్ని తొలగించే హక్కు లేదని చెప్పలేం. అది వివక్ష చూపటమే. దాన్ని రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం.. గర్భం ఉంచుకోవాలా? తీయించుకోవాలా? అన్న హక్కు వివాహితతో సమానంగా, అవివాహితకు కూడా ఉన్నది. సామాజిక సందర్భాలను బట్టి నిబంధనలు మారుతుంటాయి’ అని ధర్మాసనం తెలిపింది.
ఎంటీపీలో మారిటల్ రేప్ను చేర్చాలి
ఎంటీపీలో రేప్ అర్థానికి మారిటల్ రేప్(భార్యకు ఇష్టం లేని శృంగారం) పదాన్ని కూడా చేర్చాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘సమ్మతి లేకుండా జరిగేదే లైంగిక దాడి. వివాహం జరిగినా కలయికకు మహిళ సమ్మతి తప్పనిసరి. భర్తతోనూ భార్య లైంగిక వేధింపులు ఎదుర్కోవచ్చు. దానివల్ల ఆమె గర్భం దాల్చే అవకాశాలు ఉంటాయి. గర్భం ఉంచుకోవటం వివాహితకు ఇష్టం లేకపోతే అది బలవంతపు గర్భధారణే. అంటే.. లైంగిక దాడి కిందే లెక్క. ఇలాంటి గర్భధారణల నుంచి మహిళలను కాపాడాల్సిన అవసరం కచ్చితంగా ఉన్నది’ అని పేర్కొన్నది.
మారిటల్ రేప్ కేసులకు ఈ తీర్పు దారి
ప్రస్తుతం దేశంలో మారిటల్ రేప్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. వైవాహిక లైంగికదాడిని రేప్గా పరిగణించాలా? వద్దా? అనే దానిపై మీ అభిప్రాయం ఏమిటని సుప్రీం కోర్టు కేంద్రాన్ని వివరణ కోరింది. అంతకుముందు.. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు రెండు భిన్నమైన తీర్పులు ఇచ్చింది. భార్యతో బలవంతపు శృంగారం నేరమవుతుందని ఒక జడ్జి, నేరం కాదని మరో జడ్జి తీర్పులు ఇచ్చారు. కాగా, కోర్టు తాజా వ్యాఖ్యలతో మారిటల్ రేప్ కేసులను రేప్గా పరిగణించే అవకాశాలు ఉన్నాయి.
చట్టంలో రేప్కు అర్థమేమిటి?
ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం.. మహిళ ఇష్టానికి విరుద్ధంగా, ఆమె అనుమతి లేకుండా, భయపెట్టి సంభోగానికి ప్రయత్నిస్తే దాన్ని రేప్గా పరిగణిస్తారు. మహిళ మానసిక స్థితి సరిగా లేకపోయినా, మత్తు పదార్థాల ప్రభావం ఉన్నా రేప్ కిందే లెక్క.
చట్టం ఏం చెప్తున్నది?
ఎంటీపీ చట్టం ప్రకారం వివాహితలు, లైంగికదాడి బాధితులు, మైనర్లు, మానసిక సమస్యలు ఉన్నవారు, పిండం సరిగ్గా అభివృద్ధి చెందని ఘటనల్లో 24 వారాల లోపు అబార్షన్ చేయించుకోవచ్చు. అవివాహితలు 20 వారాల లోపు గర్భస్రావం చేయించుకోవచ్చు. తాజా తీర్పుతో గర్భం దాల్చిన మహిళలందరూ 24 వారాలలోపు అబార్షన్ చేయించుకొనే వెసులుబాటు కలిగింది.