Drinking Water | భోపాల్, ఏప్రిల్ 9: గ్రామంలో ఏర్పడిన నీటి ఎద్దడి ఓ కుటుంబంలో చిచ్చురేపింది. మంచినీళ్లు లేని ఊళ్లో తాను ఉండలేనంటూ ఓ ఇల్లాలు తన భర్తను వదిలి పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది. మధ్యప్రదేశ్లోని దేవ్ర గ్రామంలో జరిగిన అ ఘటన మంగళవారం వెలుగుచూసింది. దేవ్ర గ్రామంలో నివసించే జితేంద్ర సోని రోజువారీ కూలీ చేసుకుని బతికే కార్మికుడు.
జిల్లా ప్రధాన కార్యాలయానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవ్ర గ్రామంలో నీటి ఎద్దడి తీవ్రస్థాయిలో ఉంది. గ్రామంలో ఉన్న ఒకే ఒక్క బోరుబావి వద్ద బిందెడు నీళ్ల కోసం గ్రామస్థులు రోజంతా బారులు తీరి ఉండాల్సిందే. ఓవర్హెడ్ వాటర్ ట్యాంకును ప్రభుత్వం నిర్మించినా దానికి నీటి సరఫరా ఏర్పాట్లు లేవు. గ్రామంలో నల్లా కనెక్షన్లు అసలే లేవు.
నీటి సమస్యను భరించలేక తన భార్య పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని, పిల్లల చదువులు దెబ్బతింటాయని చెప్పినా భవిష్యత్తు లేని గ్రామంలో తన పిల్లలు ఏం బాగుపడతారని ఆమె నిలదీసిందని జితేంద్ర జిల్లా అధికారుల వద్ద వాపోయాడు. దీంతో స్పందించిన అధికారులు వెంటనే గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించాలని ప్రజారోగ్య ఇంజనీరింగ్(పీహెచ్ఈ) శాఖను ఆదేశించారు.