Ludo Game | లూడో గేమ్కు బానిస అయిన వివాహిత మహిళ, ఇంటి యజమానితో పందెం కాసింది. ఆటలో డబ్బులన్నీ పోగొట్టుకోవడంతో ఏకంగా తనపైనే పందెం వేసుకుని ఓడిపోయింది. దీంతో నాటి నుంచి ఇంటి యజమానితో కలిసి ఉంటున్నది. ఈ విషయం తెలిసిన ఆమె భర్త దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విస్తూపోయే ఈ సంఘటన బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో జరిగింది. నగర్ కొత్వాలిలోని దేవ్కలిలో ఒక అద్దె ఇంట్లో రేణు నివసిస్తున్నది. ఆమె భర్త ఆరు నెలల కిందట పని కోసం రాజస్థాన్లోని జైపూర్కు వెళ్లాడు. అక్కడ సంపాదించిన డబ్బులను ప్రతి నెలా భార్య రేణుకు పంపేవాడు.
కాగా, లూడో గేమ్కు రేణు బానిస అయ్యింది. అద్దె ఇంటి యజమానితో కలిసి ఆమె రోజూ లూడో ఆడేది. భర్త పంపే డబ్బులతో పందెం కూడా కాసేది. ఒక రోజు లూడో ఆటలో డబ్బులన్నీ ఆమె పోగొట్టుకుంది. చివరకు తనపైనే పందెం వేసుకుని ఓడి పోయింది. దీంతో ఇంటి యజమానితో కలిసి ఆమె ఉంటున్నది. జైపూర్లో ఉన్న భర్తకు ఈ విషయాన్ని చెప్పింది.
మరోవైపు రేణు భర్త హుటాహుటిన దేవ్కలికి వచ్చాడు. ఇంటి యజమానిని వీడి రావాలని ఆమెను కోరాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో రేణు భర్త చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమకు ఇద్దరు పిల్లలున్నట్లు అతడు వాపోయాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో రేణు భర్తను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆ తర్వాత దీనిపై దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.