Marriage | ఉత్తరప్రదేశ్లోని హసన్పూర్ (Hasanpur)లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గేదెల కోసం ఓ మహిళ రెండో పెళ్లికి సిద్ధమైంది. మరికాసేపట్లో వివాహం (Marriage) అనగా.. ఆమె అత్తమామల ఎంట్రీతో సీన్మొత్తం రివర్స్ అయ్యింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. అస్మా అనే మహిళకు మూడేళ్ల క్రితం నూర్ మహ్మద్తో వివాహమైంది. అయితే, ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆరు నెలల క్రితం అస్మా తన పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తతో విడాకుల కోసం అప్లై చేసుకుంది. విడాకుల అంశం కోర్టులో పెండింగ్లో ఉంది. ఈ క్రమంలో యూపీ ప్రభుత్వం ఆదివారం 300 జంటలకు సామూహిక వివాహ వేడుకను నిర్వహించింది. ఈ పథకం (Mass Marriage Scheme) కింద వధువుకు రూ.35,000 నగదుతో పాటు పలు బహుమతులు కూడా అందించింది. ఈ ఉచిత పథకం గురించి తెలుసుకున్న అస్మా.. రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.
తన బంధువు జాబర్ అహ్మద్తో రెండో పెళ్లికి సిద్ధమైంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు, ఇతర బహుమతులను పంచుకోవాలని ఇద్దరూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రభుత్వం అందించే బహుమతుల్లో రూ.35 వేల నగదుతోపాటు వధూవరులకు రెండు జతల బట్టలు, గోడ గడియారం, వ్యానిటీ కిట్, దుపట్టా, వెండి కాలి మెట్టెలు తదితర వస్తువులు ఉన్నాయి. ఇక నగదుతో గేదెలను (Buffaloes) కూడా కొనాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.
ఇక మరికాసేపట్లో వివాహం జరుగుతుందనంగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అస్మా అత్తమామల ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. వివాహ ధృవీకరణ పత్రంతో అస్మా అత్తమామలు అక్కడికి చేరుకొని ఆమెపై అధికారులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం నిబంధనలను ఉల్లంఘించినందుకు పోలీసులు అస్మా, జాబర్ అహ్మద్పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read..
IIT Baba | భారత్ గెలవదంటూ జోష్యం.. క్షమాపణలు చెప్పిన ఐఐటీ బాబా
PM Modi | ఊబకాయంపై పోరాటం.. వంటనూనె వాడకాన్ని తగ్గించాలన్న ప్రధాని మోదీ