లక్నో: తమ సమస్యను చెప్పుకునేందుకు మంత్రి కాన్వాయ్ను పశువులతో గ్రామస్తులు అడ్డుకున్నారు. (Minister’s Convoy Blocked with Cattle) ఈ నేపథ్యంలో సుమారు 90 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ధరంపాల్ సింగ్ గురువారం తన నియోజకవర్గమైన అవోన్లాలోని గుర్గావ్ ప్రాంతంలో సుమారు రూ.9 కోట్లతో నిర్మించనున్న పశు వైద్యశాల భూమిపూజ కోసం వెళ్లారు.
కాగా, గ్రామంలోని వీధుల్లో సంచరించే పశువుల సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు. రోడ్డుపై పశువులను ఉంచి మంత్రి కాన్వాయ్ను అడ్డుకున్నారు. దీంతో తగిన స్థలాన్ని గుర్తించి గోశాల ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అయితే, మంత్రి ధరంపాల్ సింగ్ కాన్వాయ్ను గ్రామస్తులు పశువులతో అడ్డుకోవడంపై పశు వైద్యాధికారి సంజయ్ కుమార్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని 90 మందిపై ఆదివారం కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ మంత్రిపై మండిపడుతున్నారు.