లక్నో : ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో తొలిసారిగా ఓ వ్యక్తిలో జికా వైరస్ ఆనవాళ్లు గుర్తించారు. సదరు వ్యక్తిని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వారెంట్ ఆఫీసర్ ఎంఎం అలీ (57) ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఆయన ఎయిర్ఫోర్స్ ఆసుపత్రిలో చేరాడు. లక్షణాల ఆధారంగా ఆసుపత్రి యాజమాన్యం నమూనాలను పరీక్షల కోసం పుణేకు పంపగా.. శనివారం రిపోర్ట్ వచ్చింది. ఈ క్రమంలో సమాచారం అందుకున్న కేంద్రం బృందం కాన్పూర్కు చేరుకున్నది.
రోగిని సంప్రదించిన వారి నమూనాలను సైతం పరీక్ష కోసం పంపారు. జికా వ్యాప్తి చెందకుండా పది బృందాలను ఏర్పాటు చేశారు. ఫోఖర్పూర్లో నివసిస్తున్న ఎంఎం అలీ నాలుగైదు రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఎయిర్ఫోర్స్ ఆసుపత్రిలో చేరాడు. ఆ తర్వాత నమూనాలను ల్యాబ్కు పంపగా జికా నిర్ధారణ కావడంతో ఆసుపత్రిలో కలకలం రేగింది. ఈ క్రమంలో అలీ పని చేసిన వారితో పాటు కలిసిన వ్యక్తులందరి నమూనాలను సేకరించారు. వాటిని పుణేకు పంపనున్నారు.
మరోవైపు ఆరోగ్య నిపుణులతో డీఎం సమావేశం నిర్వహించారు. జిల్లా మెజిస్ట్రేట్ విశాఖ్ జీ ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్, జీఎస్వీఎం మెడికల్ కాలేజీ, డిఫెరిన్, కాన్షీరామ్ హాస్పిటల్ ఆరోగ్య నిపుణులతో సమావేశమై సమీక్షించారు. అడ్మినిస్ట్రేషన్, హెల్త్ డిపార్ట్మెంట్ రోగికి సంబంధించిన ప్రాంతాలను పరిశీలించి.. వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టారు. రోగికి జికా సోకిందని జిల్లా మెజిస్ట్రేట్ ధ్రువీకరించారు. యూపీలో ఇదే తొలికేసని పేర్కొన్నారు. నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.