లక్నో: ముస్లిం విద్యార్థి చెంపపై కొట్టాలని హిందూ విద్యార్థులను ఒక టీచర్ ప్రోత్సహించిన స్కూల్ను (UP School) మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే చదువుకు ఆటకం కలుగకుండా ఆ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులను సమీపంలోని స్కూళ్లలో అడ్మిట్ చేయనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
కాగా, అభం శుభం తెలియని చిన్నారుల్లో మత జాడ్యాన్ని నూరిపోసే సంఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. ముజఫర్నగర్లోని ఓ ప్రైవేటు స్కూల్లో 1వ తరగతి చదువుతున్న ముస్లిం విద్యార్థిని కొట్టాలని హిందూ విద్యార్థులను ఉపాధ్యాయురాలు ప్రోత్సహించింది. దీంతో కొందరు విద్యార్థులు ఆ బాలుడి చెంపపై పదేపదే కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో మత విభేదాలు సృష్టించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
మరోవైపు స్కూల్ ప్రిన్సిపల్ అయిన ఆ ఉపాధ్యాయురాలు తన చర్యను సమర్థించుకున్నది. ముస్లిం విద్యార్థులు సరిగా చదవడం లేదని వారి తల్లులు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో వారికి చదువు రావాలన్న ఉద్దేశంతో మిగతా విద్యార్థులతో కొట్టించినట్లు చెప్పింది. ఇందులో ఎలాంటి దురాభిప్రాయం లేదని వెల్లడించింది. అయితే బాలుడి తండ్రి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అలాగే విద్యాశాఖ అధికారులు కూడా ఆ స్కూల్పై చర్యలు చేపట్టారు. ఆ ప్రైవేట్ స్కూల్ను మూసివేయాలని ఆదేశించారు.