ఆగ్రా, సెప్టెంబర్ 5: ఉత్తరప్రదేశ్లో మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. ఇసుక లోడుతో ఉన్న దాదాపు డజను ట్రాక్టర్లు ఆదివారం రాత్రి ఆగ్రాలోని ఓ టోల్ప్లాజా వద్ద బ్యారికేడ్లను విరగ్గొట్టుకొని వేగంగా ముందుకు దూసుకెళ్లాయి. మొదటి ట్రాక్టర్ టోల్ప్లాజా వద్ద ఆగుతుందని అక్కడి సిబ్బంది భావించినప్పటికీ అలా జరగలేదు. టోల్ చార్జీ చెల్లించకుండా బ్యారికేడ్లను విరగ్గొట్టి వేగంగా వెళ్లిపోయింది. దాని వెనుక వస్తున్న మిగిలిన ట్రాక్టర్లు కూడా టోల్ప్లాజా వద్ద ఆగకుండా బ్యారికేడ్లను దాటుకొని వేగంగా వెళ్లిపోయాయి. వాటిని ఆపేందుకు టోల్ప్లాజా సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
ఈ ట్రాక్టర్లన్నీ స్థానిక ఇసుక మాఫియాకు చెందినవేనని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. ఆగ్రా-గ్వాలియర్ రహదారిపై జజావు టోల్ప్లాజా వద్ద జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్టు ఆగ్రా ఎస్ఎస్పీ ప్రభాకర్ చౌదరి వెల్లడించారు. నిందితులపై గ్యాంగ్స్టర్ చట్టం కింద చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు.