లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగనుండగా.. తొలిదశ ఎన్నికల్లో పోటీపడబోయే అభ్యర్థులను పార్టీ ఇప్పటికే ఖరారు చేసింది. అభ్యర్థుల ఎంపిక పూర్తికావడంతో ఇక తొలి దశ పోలింగ్ జరుగనున్న నియోజకవర్గాల్లో ప్రచారంపై ఇప్పుడు పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది.
ఈ మేరకు తాజాగా 30 మంది కాంగ్రెస్ ప్రముఖుల పేర్లతో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. ఈ స్టార్ క్యాంపెయినర్లలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, పార్టీ అగ్ర నాయకులు రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీ, సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్, సచిన్ పైలట్ తదితరులు ఉన్నారు.
కాగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఫలితాలను వెల్లడించనున్నారు. ఉత్తరప్రదేశ్తోపాటు ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలకు కూడా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి.