గ్యాంగ్రేప్పై ఫిర్యాదుకు వెళ్లితే దారుణం
యూపీలోని లలిత్పూర్లో ఘటన
మరోచోట యువతిపై లైంగిక దాడి
యోగి సర్కారుపై ప్రతిపక్షాల ధ్వజం
లక్నో/గోండా, మే 4: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోతున్నది. రోజురోజుకి వారిపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో రెండు దారుణ ఘటనలు వెలుగుచూశాయి. గ్యాంగ్ రేప్ చేశారని ఓ మైనర్ బాలిక ఫిర్యాదు చేయటానికి వెళ్తే స్టేషన్ హౌస్ ఇన్ఛార్జ్(ఎస్హెచ్ఓ)గా ఉన్న పోలీసు అధికారే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన లలిత్పూర్ జిల్లాలో చోటుచేసుకొన్నది. గతనెల 22న 13 ఏండ్ల బాలికను నలుగురు వ్యక్తులు అపహరించి మధ్యప్రదేశ్లోని భోపాల్ తీసుకెళ్లి మూడు రోజులు గ్యాంగ్రేప్నకు పాల్పడ్డారు. అనంతరం తీసుకొచ్చి వదిలేశారు. ఫిర్యాదు చేసేందుకు పాలి పోలీసుస్టేషన్కు వెళ్లగా, స్టేషన్ ఆఫీసర్ తిలక్ధారి సరోజ్ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధిత బాలిక స్థానిక ఎన్జీఓ సాయంతో జిల్లా ఎస్పీ ముందు గోడు వెళ్లబోసుకోగా, ఆయన ఆదేశాల మేరకు మంగళవారం కేసు నమోదైంది. స్టేషన్ ఆఫీసర్ను అరెస్ట్ చేశారు.
ఆటోను అడ్డగించి.. లాక్కెళ్లి!
మరో ఘటనలో ఒక యువతి ఆటోలో వెళ్తుండగా అడ్డగించిన నలుగురు యువకులు ఆమెను లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఘటన గతనెల 23న గోండా జిల్లాలోని ధనేపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నదని ఏఎస్పీ శివరాజ్ తెలిపారు. లలిత్పూర్ ఘటనపై ఎన్హెచ్ఆర్సీ బుధవారం యూపీ ప్రభుత్వం, డీజీపీకి నోటీసులు ఇచ్చింది. ఠాణా ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, క్షేత్రస్థాయి దర్యాప్తునకు బృందాన్ని పంపుతున్నట్టు జాతీయ చిన్నారుల హక్కుల పరిరక్షణ కమిషన్ పేర్కొన్నది.
బాధితులకు న్యాయం ఇంకెక్కడ?
అత్యాచార ఘటనలపై ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ తీవ్రంగా స్పందించాయి. ఫిర్యాదు చేసేందుకు వెళ్లేందుకు వెళ్లిన వారిపై పోలీసే లైంగికదాడికి పాల్పడితే.. ఇక బాధితులు ఎక్కడకు వెళ్లాలని ఎస్పీ ప్రశ్నించింది. బీజేపీ ప్రభుత్వంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది పెద్ద ప్రశ్నగా ఉన్నదని, దీనిపై సీఎం యోగి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. పోలీసుస్టేషన్లలో మహిళా సిబ్బంది సంఖ్యను పెంచాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ట్విట్టర్లో డిమాండ్ చేశారు.