లక్నో, జూలై 20: ఉత్తరప్రదేశ్ డబుల్ ఇంజిన్ సర్కారులో రోజుకొక ట్రబుల్ బయటపడుతున్నది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో దళితులకు సరైన గౌరవం దక్కడం లేదన్న సంగతి వెలుగులోకి వచ్చింది. ఓ దళిత మంత్రి ఖిన్నుడై రాజీనామా చేయడమే ఇందుకు సాక్ష్యం. జల్శక్తి శాఖమంత్రి దినేశ్ ఖటిక్ తన శాఖలో వేధింపులు భరించలేక పదవి నుంచి వైదొలగుతున్నట్టు రాజీనామా లేఖలో తెలిపారు. తాను దళితుడైనందునే అధికారులు పట్టించుకోవడం లేదని, జల్శక్తి శాఖలో అవినీతి పెచ్చరిల్లిందని ఆరోపిస్తూ ఆ లేఖను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నేరుగా పంపారు.
ఆవేదనతో రాజీనామాకు సిద్ధమైన్నట్టు ఆ లేఖలో తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ లేఖ వైరల్ అవుతున్నది. ఖటిక్ అభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు మీడియా ప్రయత్నించగా అలాంటి సమస్య ఏదీ లేదని సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీకి వెళ్లినట్టు మంత్రి సన్నిహిత వర్గాలు తెలిపాయి. 44 ఏండ్ల ఖటిక్ మీరట్ జిల్లా హస్తినాపూర్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎన్నికయ్యారు. దళిత బహుజనుల మద్దతు ద్వారానే యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని మంత్రి ఖటిక్ తన లేఖలో పేర్కొన్నారు.
‘జల్శక్తి శాఖలో సహాయమంత్రినైన నేను, ఒక దళితుడిని కావడం వల్లనే నా ఉత్తర్వులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.. పైగా శాఖలో అమలవుతున్న పథకాల గురించి నాకు చెప్పడం లేదు’ అని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. సమాచారం లేకపోవడంతో శాఖలో ఏం జరుగుతున్నదో తెలియడం లేదని అన్నారు. బదిలీల సీజన్లో డిపార్టుమెంటులో చాలా అవినీతి చోటు చేసుకున్నదని ఆరోపించారు. అధికారుల బదిలీలపై సమాచారం అడిగినా ఇవ్వలేదని చెప్పారు. పరిస్థితి గురించి నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ గార్గ్తో మాట్లాడాలని ప్రయత్నిస్తే చెప్పేది వినకుండా ఫోన్ కట్ చేశారని ఖటిక్ తెలిపారు. తన మాటలు ఏమాత్రం ఖాతరు చేయలేదని వాపోయారు.
నాకే కాదు యావత్తు దళిత సమాజానికి అవమానం
ఒక ప్రజాప్రతినిధికి ఇంతకన్నా ఘోరమైన అవమానం ఉండదని ఖటిక్ తెలిపారు. దళిత కులానికి చెందిన మంత్రిని కావడం వల్లనే శాఖలో తనమీద ఇంతగా వివక్ష చూపుతున్నారని, తాను లేఖలు రాసినా సమాధానం ఇవ్వడం లేదని వాపోయారు. నమామి గంగే పథకంలో అవినీతి పొంగిపొర్లుతున్నదని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో వెళ్లి చూస్తే ఈ అవినీతి గుట్టు తెలుస్తుందని, తాను ఎవరైనా అధికారి మీద ఫిర్యాదు చేస్తే చర్య తీసుకోవడం లేదని చెప్పారు. ఏ సంస్థ ద్వారానైనా దీనిపై దర్యాప్తు చేసుకోవచ్చని సవాల్ చేశారు. దళితులను అధికారులు అవమానిస్తున్నారని మండిపడ్డారు. తనకు దళిత సమాజంతో సంపూర్ణ సంబంధాలున్నాయని, వారికి జరిగే అన్యాయాలపై చర్య తీసుకోవడం లేదని అన్నారు. దీనివల్ల తాను మాత్రమే కాకుండా యావత్తు దళిత సమాజం అవమానాలకు గురవుతున్నదని చెప్పారు.
ప్రధానమంత్రి నమామి గంగే పథకం, హర్ ఘర్ జల్ యోజనల నిబంధలను గాలికి వదిలేస్తున్నారని ఖటిక్ ఆరోపించారు. తన విభాగంలో బదిలీల పేరిట డబ్బులు చేతులు మారాయని, దీనిపై విభాగాధికారికి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఇప్పటిదాకా తన ఫిర్యాదు ఎక్కడిదక్కడే ఉండిపోయిందని అన్నారు. దళితుడైన మంత్రికి శాఖలో ఎలాంటి గుర్తింపు లేకపోతే దళిత సమాజానికి ఆ మంత్రివల్ల ఉపయోగం ఏమిటని నిలదీశారు. వీటన్నిటి వల్ల మనసు గాయపడి రాజీనామా చేస్తున్నట్టు ఖటిక్ కేంద్ర హోంమంత్రికి రాసిన లేఖలో తెలియజేశారు.
గౌరవం లేనప్పుడు తప్పుకోవడమే మంచిది: ఎస్పీ అధినేత అఖిలేశ్
సోషల్ మీడియాలో మంత్రి లేఖ వెలుగు చూసిన వెంటనే ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందించారు. మంత్రిగా గౌరవం లేదు.. దళితుడుగా అగౌరవం కలుగుతుంటే.. మన సమాజ గౌరవం కాపాడుకునేందుకు వివక్షాపూరిత బీజేపీ సర్కారు నుంచి వైదొలగడం ఒక్కటే మార్గం అని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలోనే ఒక దళిత మంత్రి ఇలా అలక్ష్యానికి గురికావడం దురదృష్టకరమని, తీవ్రంగా ఖండించదగ్గ విషయమని బీఎస్పీ అధినేత మాయావతి ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో ఈ వ్యవహారంపై చర్చ జరుగుతున్నదని పేర్కొన్నారు. దళితుల పట్ల ప్రభుత్వం తన కులతత్వ ధోరణిని వీడాలని చెప్పారు. బీజేపీ ప్రభుత్వంలో అవినీతి పరిశ్రమగా మారి మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతున్నదని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది.
రెండో విడతలో యోగికి చిక్కులు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు రెండో విడత అచ్చివచ్చినట్టు కనిపించడం లేదు. పలువురు మంత్రులు సర్కారు తీరుపై బాహాటంగానే అసమ్మతి గళం విప్పుతున్నారు. ఉపముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్ సర్కారుపై ఒంటికాలితో లేచారు. తాను నిర్వహిస్తున్న ఆరోగ్య శాఖలో బదిలీలపై భగ్గుమన్నారు. ఇదంతా యోగి సర్కారుకు తలనొప్పిగా మారడంతో బదిలీల వ్యవహారం పరిశీలనకు ముగ్గురు సభ్యుల కమిటీ వేయాల్సి వచ్చింది. పాఠక్ను ఊరుకోబెట్టేలోపు పబ్లిక్ వర్క్స్ శాఖమంత్రి జితిన్ ప్రసాద అలిగి కూర్చున్నారు. యోగి ఆ శాఖలోని అధికారులపై నేరుగా చర్య తీసుకోవడమే ఇందుకు కారణం. ప్రసాద ఓఎస్డీతో సహా మరో ఐదుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ అంశంపై అమిత్ షాను కలిసేందుకు ప్రసాద ఢిల్లీకి కూడా వెళ్లారు. తాజాగా దళితమంత్రి దినేశ్ ఖటిక్ కేంద్ర హోంమంత్రికి రాజీనామా లేఖను పంపడంపై దుమారం చెలరేగుతున్నది.