న్యూఢిల్లీ: అక్రమ అరెస్టులపై ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఢిల్లీ హైకోర్టు చీవాట్లు పెట్టింది. ఇష్టమొచ్చినట్లు అరెస్టులు చేయడం యూపీలో నడుస్తుందేమోగానీ ఇక్కడ నడువదు (యూపీ మే చల్తా హోగా యహా నహీన్) అని హైకోర్టు వ్యాఖ్యానించింది. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఢిల్లీకి చెందిన ఓ యువకుడు యూపీకి చెందిన యువతిని ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. అయితే ఆ పెండ్లి యువతి కుటుంబసభ్యులకు ఇష్టం లేదు. వాళ్లు చంపుతామని బెదిరిస్తుండటంతో కొత్త జంట అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.
ఈ క్రమంలో యువతి తల్లి యూపీలోని షామ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కుమార్తెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి పెండ్లి చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నది. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఢిల్లీకి వెళ్లి యువకుడి తండ్రిని, అన్నను అరెస్ట్ చేసి యూపీకి తీసుకెళ్లారు. దీని గురించి ఢిల్లీ పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. పైగా వాళ్లను అరెస్ట్ చేసిన నెల రోజుల వరకు వారని ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియనివ్వలేదు.
దాంతో ఈ ఘటనపై బాధిత జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేం ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడే పెండ్లి చేసుకున్నామని యువకుడు, తాను తన ఇష్టంతోనే అతడిని పెండ్లి చేసుకున్నానని యువతి తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. కేసు ఢిల్లీ హైకోర్టుకు వెళ్లడంతో న్యాయమూర్తి ముక్తా గుప్తా ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా యూపీ పోలీసుల తీరును తప్పుపట్టింది.
మేజర్లైన ఇద్దరు వ్యక్తులు తమ ఇష్ట ప్రకారం పెండ్లి చేసుకుని వెళ్లిపోయినప్పుడు వారి కుటుంబసభ్యులను అరెస్ట్ చేసే అధికారం మీకు ఎలా ఉంటుందని కోర్టు ప్రశ్నించింది. ఎవరో ఏదో ఫిర్యాదు చేసినంత మాత్రానా.. పెండ్లి చేసుకున్నది మేజర్లో, మైనర్లో విచారణ చేయకుండా, అసలు కిడ్నాప్ జరిగిందా..? ఇష్టపూర్వకంగా వెళ్లారా తెలుసుకోకుండా యువకుడి కుటుంబసభ్యులను ఎలా అరెస్ట్ చేశారని కోర్టు చీవాట్లు పెట్టింది. ఈ క్రమంలోనే ఈ పద్ధతి యూపీలో నడుస్తుందేమోగానీ, ఢిల్లీలో నడవదని వ్యాఖ్యానించింది.