లక్నో: కరోనా థర్డ్ వేవ్ జెట్ స్పీడులో విస్తరిస్తుండటంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. మహమ్మారి స్పీడుకు అడ్డుకట్ట వేయడానికి కొవిడ్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూను అమల్లోకి తెచ్చింది. ఇవాళ రాష్ట్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థల్లో తరగతులను రద్దు చేయాలని, ఆన్లైన్ తరగతులను మాత్రమే కొనసాగించాలని యూపీ సర్కారు నిర్ణయించింది. నైట్ కర్ఫ్యూ ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ నెల 16 వరకు ఆఫ్లైన్ తరగతులను రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, విద్యాసంస్థలు ఇప్పటికే షెడ్యూల్ అయిన పరీక్షలను నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది.