న్యూఢిల్లీ, నవంబర్ 15: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖీరీ రైతుల హత్య కేసుపై సిట్ చేస్తున్న దర్యాప్తును విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. పర్యవేక్షణకు అత్యున్నత ధర్మాసనం ఎవరిని నియమించినా తమకు సమ్మతమేనని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు సోమవారం వెల్లడించింది. కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందంలో (సిట్) తక్కువ ర్యాంకు కలిగిన పోలీసులు ఉండటాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సందర్భంగా ఆక్షేపించింది. యూపీ క్యాడర్లోని అదే రాష్ర్టానికి (యూపీకి) చెందన ఐపీఎస్ అధికారులను సిట్లో నియమించాలని, వీరి పేర్లను మంగళవారం సాయంత్రంలోగా సిఫారసు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా గత నెల 3న సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపైకి కేంద్రమంత్రి అజయ్మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా వాహనశ్రేణి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అన్నదాతలు మరణించగా, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల్లో మరో నలుగురు మృత్యువాతపడ్డారు. కేసు దర్యాప్తులో యూపీ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడంపై సుప్రీంకోర్టు ఇప్పటికే పలుమార్లు అసహనం వ్యక్తం చేసింది. సిట్ దర్యాప్తును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం.. అదే రాష్ర్టానికి చెందిన అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జిని నియమించడాన్ని తప్పుబట్టింది. దీంతో సిట్ దర్యాప్తును రోజూవారీగా పర్యవేక్షించేందుకు వేరే రాష్ర్టానికి చెందిన విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తిని నియమిస్తామని కోర్టు గతంలో ప్రతిపాదించింది. దీనికి తాజాగా యూపీ ప్రభుత్వం సమ్మతించింది.
సుప్రీం రిటైర్డ్ జడ్జిల పేర్లను పరిశీలిస్తాం
సిట్ దర్యాప్తును రోజూవారీగా పర్యవేక్షించే విశ్రాంత న్యాయమూర్తి కోసం.. హైకోర్టు మాజీ జడ్జిల పేర్లతో పాటుగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిల పేర్లను కూడా పరిశీలిస్తామని ధర్మాసనం వెల్లడించింది. రిటైర్డ్ జడ్జి ఎంపిక, వారి సమ్మతిని తెలుసుకోవడానికి కనీసం ఒకరోజు సమయం అవసరపడుతుందని.. దీనికి సంబంధించి ఆదేశాలను బుధవారం జారీ చేస్తామని కోర్టు పేర్కొంది. కాగా, ఈ కేసులో అరెస్టయిన ఆశిష్ మిశ్రాకు స్థానిక కోర్టు బెయిల్ నిరాకరించింది.