(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, జనవరి 9(నమస్తే తెలంగాణ): సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అంటూ డొల్ల నినాదాలతో పబ్బం గడుపుతున్న బీజేపీ, వాస్తవానికి తమ పార్టీ పాలిత రాష్ర్టాల్లో బడుగు ఉద్యోగుల ఉసురు తీస్తున్నది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో జీతాలు పెంచాలని కొన్ని నెలలుగా ఆర్టీసీ కాంట్రాక్టు డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు. అయితే ప్రభుత్వం వారి జీతాలను కిలోమీటర్కు కేవలం 16 పైసలు పెంచి చేతులు దులుపుకుంది. దాంతో యోగి ప్రభుత్వ పాలనపై కాంట్రాక్టు ఉద్యోగుల సంఘాలు మండి పడుతున్నాయి.
యూపీ ఆర్టీసీలో మొత్తం 52 వేల సిబ్బంది పని చేస్తుండగా, అందులో 34 వేల మంది కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కార్మికులు. కాంట్రాక్టు డ్రైవర్లకు నెలకు రూ.5 వేలు జీతం ఇస్తుండటంతో 2020 నుంచి జీతాలు పెంచాలని వారు పోరాటం చేస్తున్నారు. దీంతో ఇటీవల వారికి కిలో మీటర్ దూరానికి చెల్లించే మొత్తాన్ని 16 పైసలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఒక కిలో మీటర్కు రూ.1.75 పైసలు చెల్లిస్తారు. ఈ లెక్కన కాంట్రాక్టు డ్రైవరుకు నెలకు రూ.8750 జీతంగా వస్తుంది.
8 వేలతో బతికేదెట్లా?
ప్రభుత్వ ప్రకటనతో కాంట్రాక్టు డ్రైవర్లు మండి పడుతున్నారు. నెలకు రూ.8-9 వేలతో తాము భార్యా బిడ్డలను ఎలా పోషించాలని ప్రశ్నిస్తున్నారు. ద్రవ్యోల్బణం 4 రెట్లు పెరిగితే ప్రభుత్వం కేవలం 10 శాతం కూడా జీతం పెంచలేదని యూపీ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ గిరీష్ చంద్ర మిశ్రా మండిపడ్డారు. కాంట్రాక్టు డ్రైవర్లకు కనీసం రూ.18 వేల జీతం చెల్లించాలని, వైద్య సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పర్మినెంట్ డ్రైవర్లకు రూ.25 వేల జీతం చెల్లిస్తూ, అదే పని చేసే కాంట్రాక్టు డ్రైవర్లకు రూ.8-9 వేలు మాత్రమే జీతమివ్వడం అన్యాయమన్నారు. ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు కుట్ర చేస్తున్నదని, అందుకు తాము ఒప్పుకోమని యూనియన్ నాయకులు ప్రకటించారు.