లక్నో: రూ.1.6 కోట్ల పన్ను చెల్లించాలంటూ ఒక రైతుకు (UP farmer) ఏకంగా 23 నోటీసులు అందాయి. అలాగే కార్లలో వచ్చిన ఐటీ అధికారులు ఆ రైతు ఇంటిని కూడా తనిఖీ చేశారు. దీంతో సన్నకారు రైతు షాక్ అయ్యాడు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫలోడా గ్రామానికి చెందిన ఉపదేశ్ త్యాగి ఒక చిన్న రైతు. ఏడాదిగా ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ నుంచి ఆయనకు పలు నోటీసులు వస్తున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతాలో రూ.4 కోట్ల 6 లక్షల మేర లావాదేవీలు జరిపినట్లు అందులో ఉంది. పలు లావాదేవీలకు సంబంధించి రూ.1.6 కోట్ల పన్నులను ఆ రైతు చెల్లించాల్సి ఉందని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రతి రెండు నెలలకు ఒక నోటీస్ చొప్పున గత ఏడాది నుంచి 20కిపైగా నోటీసులను ఆ రైతు అందుకున్నాడు. ఈ ఏడాది మార్చి 22న మరో నోటీసు అందింది.
కాగా, రైతు ఉపదేశ్ త్యాగితోపాటు ఆయన కుటుంబ సభ్యులు ఐటీ నోటీసులు చూసి షాక్ అయ్యారు. తన బ్యాంకు ఖాతా నుంచి కోట్లలో లావాదేవీలు జరుపలేదని ఐటీ అధికారులకు అతడు చెప్పినా వారు పట్టించుకోలేదు. రూ.1.6 కోట్ల మేర పన్నులు చెల్లించాలని, లేనిపక్షంలో చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలాగే మూడు వాహనాల్లో వచ్చిన ఐటీ అధికారులు ఆ రైతు ఇంటిపై రైడ్ కూడా చేశారు. ఒత్తిడి ఎక్కువ కావడంతో రైతు త్యాగి ఒక న్యాయవాదిని ఆశ్రయించాడు. పొరపాటు ఎక్కడ జరిగిందో పరిశీలించాలంటూ ఆ న్యాయవాది ద్వారా ఐటీ అధికారులను కోరే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.
దీంతో రైతు ఉపదేశ్ త్యాగి చివరకు రాజకీయ నేతను ఆశ్రయించాడు. గ్రామానికి చెందిన పలువురు రైతులతో కలిసి రాజకీయంగా ప్రభావం ఉన్న విశ్వ హిందూ మహాసంఘ్ అధ్యక్షుడు తరుణ్ త్యాగి వద్దకు వెళ్లి తన గోడు చెప్పుకున్నాడు. ఆ తర్వాత వారంతా కలిసి ముజఫర్నగర్ ఆదాయపు పన్ను అధికారి రజనీష్ రస్తోగిని కలిశారు. దీంతో ఆ రైతు సమస్యను పరిశీలిస్తానని ఆ అధికారి భరోసా ఇచ్చారు.
మరోవైపు బ్యాంకులో పొరపాటు జరిగినట్లు ఐటీ శాఖ అధికారులు చివరకు గుర్తించారు. అభిషేక్ అనే వ్యక్తి పాన్ కార్డు వివరాలను పొరపాటుగా రైతు త్యాగి బ్యాంకు ఖాతాలో నమోదు చేసినట్లు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ పొరపాటును సరిదిద్దేందుకు సంబంధిత చర్యలు తీసుకున్నట్లు ఐటీ అధికారి రజనీష్ వెల్లడించారు. దీంతో రైతు త్యాగికి ఐటీ నోటీసులు రావడం ఆగాయి. అయితే ఏడాది వరకు ఆ రైతు ఎంతో మానసిక క్షోభ, ఒత్తిడిని ఎదుర్కొన్నాడు.