లక్నో: కరోనా కష్టకాలంలో తన చుట్టూ ఉన్న వాళ్లు ఇబ్బందులు పడుతుంటే అందరిలా చూస్తూ ఊరుకోలేదు అతను. వేల మందికి అండగా నిలబడ్డారు. ఉచిత వైద్యంతో పాటు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు.. తన యావదాస్తిని ప్రభుత్వానికి రాసిచ్చాడు. ఆయనే ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్కు చెందిన డాక్టర్ అర్వింద్ గోయల్ (Dr. Arvind Goyal ). గత 50 ఏండ్లుగా ప్రజలకు సేవచేస్తున్నారు. కేవలం ఇంటిని మాత్రమే ఉంచేసుకుని సుమారు రూ.600 కోట్ల విలువ చేసే తన ఆస్తినంతటిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి రాసిచ్చారు. నిరుపేదల సంక్షేమం, ఉచిత విద్య కోసం ఈ డబ్బులను వినియోగించాలని సూచించారు. 25 ఏండ్ల కిందే ఈ నిర్ణయం తీసుకున్నానని డాక్టర్ గోయల్ చెప్పారు.
గోయల్ 100కు పైగా విద్యాసంస్థలు, వృద్ధాశ్రమాలు, ఆస్పత్రులకు ట్రస్టీగా ఉన్నారు. గోయల్కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆస్తిని విరాళంగా ఇస్తానని చెప్పగానే కుటుంబసభ్యులు కూడా మద్దతు ఇచ్చారు.
కరోనా లాక్డౌన్ సమయంలో మొరదాబాద్ పరిధిలోని 50 గ్రామాలను దత్తత తీసుకుని అన్ని రకాల వసతులు కల్పించారు. ఉచిత విద్యను అందించడంతోపాటు రాష్ట్రంలోని పేదలకు ఫ్రీగా మెరుగైన వైద్యం అందించారు. తన సేవలకుగాను నలుగురు రాష్ట్రపతుల చేతులమీదుగా పలు పురస్కారాలు అందుకున్నారు.
ఆ సంఘటనే గోయల్ను మార్చేసింది
25ఏళ్ల క్రితం జరిగిన సంఘటనే నా జీవితాన్ని మార్చేసిందని ఈ సందర్భంగా గోయల్ చెప్పారు. ‘పాతికేళ్ల క్రితం నేను రైళ్లో ప్రయాణిస్తున్నప్పుడు ఓ వ్యక్తి నా ఎదురుగా కూర్చున్నాడు. ఓవైపు వణుకుపుట్టించే చలి.. ఒంటిపైన కప్పుకోవడానికి ఏమీ లేవు. కాళ్లకు చెప్పులు కూడా లేవు. అతడిని చూసి చలించిపోయి చేతనైన సాయం చేశా. కానీ అ సంఘటన మనసులో అలాగే ఉండిపోయింది. ఒక్కరికైతే సాయం చేయగలిగా.. కానీ దేశంలో ఇలాంటి వాళ్లు ఎంతో మంది ఉంటారు కదా అనిపించింది. వాళ్లకు కూడా సాయం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను’ అని చెప్పుకొచ్చారు.