Lucknow | యూపీ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య ఇంటర్వ్యూ మధ్యలోనే నిష్క్రమించారు. మాట్లాడుతుండగానే మైక్ పక్కన పెట్టేసి వెళ్లిపోయారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో ఓ ఛానల్ ఆయన్ను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగానే హరిద్వార్ వేదికగా జరిగిన సాధు సంతుల సమ్మేళనం గురించి ఆయన్ను ప్రశ్నించారు. కొద్ది సేపు సమాధానం చెప్పి, మరో ప్రశ్న అడిగే సరికే.. మధ్యలోనే ఆయన నిష్క్రమించారు. మాట్లాడుతుండగానే మైక్ పెట్టేసి వెళ్లిపోయారు. హరిద్వార్ వేదికగా జరిగిన ఉపన్యాసాల పరంపరపై అడగ్గా… ‘మీరు ఏ వీడియో గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. మీరు ఎన్నికల గురించి అడుగుతున్నారా.. ఓ పాత్రికేయుడిగా మీరు మాట్లాడటం లేదు. ఓ గ్రూపుకు వకాల్తా తీసుకున్నట్లుంది మీ వ్యవహారం. ఓ గ్రూపకు ఏజెంట్గా మాట్లాడుతున్నారు. నేను మీతో మాట్లాడను’ అంటూ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య తేల్చి చెప్పారు. ఆ తర్వాత ఇది దురదృష్ట ఘటన అని వివరణ ఇచ్చారు.
హరిద్వార్ వేదికగా జరిగిన ఉపన్యాసాలను ఏమైనా వెనక్కి తీసుకుంటారా? మరోసారి పరిశీలించుకుంటారా? అని విలేకరి ప్రశ్నించగా.. మేమెలాంటి వారమో నిరూపించుకోవాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదని కుండబద్దలు కొట్టారు. సబ్ కా సాథ్… సబ్ కా వికాస్ అన్న నినాదాన్నే తాము బలంగా విశ్వసిస్తామని, తమ తమ అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ మతాచార్యులకు తప్పకుండా వుంటుందన్నారు. కేవలం హిందూ ధర్మానికి చెందిన వారినే మీడియా ఎందుకు టార్గెట్ చేస్తోందని కూడా మౌర్య ప్రశ్నించారు. ఏ విషయాన్నైతే బలంగా విశ్వసిస్తారో.. దాన్నే మాట్లాడతారని, ఆ విషయాలను రాజకీయాలతో ముడిపెట్టడం భావ్యం కాదని కేశవ ప్రసాద్ మౌర్య అభిప్రాయపడ్డారు.