లక్నో: సంతానం లేని ఒక జంట మేక పిల్లలను తమ పిల్లలుగా పెంచుకుంటున్నారు. ఏడాది నిండిన సందర్భంగా ఇటీవల ఘనంగా తొలి పుట్టిన రోజు వేడుకను నిర్వహించారు. ఉత్తర ప్రదేశ్లోని బండాలో ఈ సంఘటన జరిగింది. కాన్షీరామ్ కాలనీకి చెందిన రాజా దంపతులకు పెళ్లై చాలా కాలమైనా సంతానం కలగలేదు. కాగా, వారు పెంచుతున్న మేక గత ఏడాది రెండు పిల్లలను ఈనింది. దీంతో సంతానం లేని ఆ దంపతులు ఆ మేక పిల్లలను తమ పిల్లలుగా భావించి పెంచుతున్నారు. వాటికి కుబేర్, లక్ష్మి అని పేరు పెట్టారు. రాజా తన రిక్షాలో వాటిని షికారుకు కూడా తీసుకెళ్లసాగాడు.
కాగా, ఆ మేక పిల్లలు పుట్టి ఏడాదైంది. ఈ నేపథ్యంలో రాజా దంపతులు ఘనంగా వాటి తొలి పుట్టిన రోజు వేడుకను నిర్వహించారు. బంధువులు, స్నేహితులను ఆహ్వానించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా డీజే కూడా ఏర్పాటు చేశారు. మేక పిల్లల బర్త్ డే పార్టీకి వచ్చిన వారు, వాటి కోసం బహుమతులు కూడా తెచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.