సిలిగురి: ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నేతలు రాజేష్ పతి త్రిపాఠి, లలితేష్ పతి త్రిపాఠి పార్టీకి గుడ్బై చెప్పారు. సిలిగురిలో తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతాబెనర్జి, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జి సమక్షంలో వారిద్దరూ టీఎంసీలో చేరారు. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పనితీరు నచ్చే తాము ఆ పార్టీలో చేరామని త్రిపాఠీలు ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతల కప్ప గంతులు మొదలయ్యాయి. ఆ మేరకు ఇవాళ త్రిపాఠీ బ్రదర్స్ తృణమూల్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం రిజర్వేషన్లు, ఎన్నికల్లో గెలిస్తే విద్యార్థులకు ల్యాప్టాప్లు, స్కూటీలు అంటూ కాంగ్రెస్ పార్టీ హామీలు గుప్పిస్తున్నది. అయినా కీలక నేతలు చేజారిపోతుండటం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తున్నది.