లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. తుది విడత పోరుకు ప్రచారంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అగ్రనేతలు భారీ రోడ్షోలు, మెగా ర్యాలీలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. యూపీలో మరోసారి అధికార పగ్గాలు చేపడతామని సీఎం యోగి ఆదిత్యానాధ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2017కు ముందు ఎన్నికల సందర్భంగా యూపీలో హింస చెలరేగేదని కానీ ఇప్పడు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పారు. ఆరు దశల పోలింగ్ ముగియగా ఏడో దశ పోలింగ్కు ప్రచారం ప్రశాంతంగా సాగుతోందని ఆయన పేర్కొన్నారు. లక్నోలో శనివారం యోగి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ దేశ అజెండాను మార్చివేశారని చెప్పుకొచ్చారు. ప్రధాని గ్రామాలు, పేదలు, అణగారిన వర్గాల బాగు కోసం శ్రమిస్తున్నారని అన్నారు.
మహిళల భద్రత కోసం యాంటీ రోమియో స్క్వాడ్లను ప్రవేశపెట్టామని, అక్రమ కబేళాలను మూసివేశామని ఆయన వివరించారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తన నియోజకవర్గం వారణాసిలో ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగిస్తూ విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్ అంశాన్నీ యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రస్తావించారు. దేశం ముంగిట పలు సవాళ్లు ఎదురైన సందర్భంలో విపక్షాలు వాటిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మన భద్రతా దళాలు, ప్రజలు సంక్షోభాన్ని అధిగమించేందుకు పోరాడుతుంటే వాటిని మరింత సంక్లిష్టం చేసేందుకు వారు (ప్రతిపక్షాలు) అన్ని ప్రయత్నాలు చేస్తారని మండిపడ్డారు.
కరోనా మహమ్మారి విషయంలో ప్రస్తుతం ఉక్రెయిన్ సంక్షోభంలోనూ విపక్షాల తీరును మనం చూశామని ప్రధాని పేర్కొన్నారు. ఇక యూపీలో నిరుద్యోగ సమస్య తీవ్రతను కేవలం సమాజ్వాదీ పార్టీయే లేవనెత్తుతోందని ఆ పార్టీ వ్యవస్ధాపకుడు, మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ అన్నారు. తమ పార్టీ నిరంతరం పేదలు, యువత, అణగారిన వర్గాల సంక్షేమానికి కట్టుబడిఉందని స్పష్టం చేశారు. ఇక యూపీలో ఫిబ్రవరి 10 నుంచి ఇప్పటివరకూ ఆరు దశల పోలింగ్ ముగియగా మార్చి 7న తుది దశ పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.