లక్నో: అందరి ముందు వరుడు ముద్దు పెట్టడంపై వధువు ఆగ్రహించింది. అతడి క్యారెక్టర్ను అనుమానించి పెళ్లి రద్ధు చేయాలని డిమాండ్ చేసింది. ఉత్తరప్రదేశ్లోని సంబల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 26న ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సామూహిక పెళ్లిళ్లు జరిగాయి. ఈ సందర్భంగా డిగ్రీ చదివిని 23 ఏళ్ల యువతికి ఒక వ్యక్తితో వివాహం జరిగింది. అనంతరం మంగళవారం రాత్రి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. సుమారు 300 మంది అతిథులు హాజరయ్యారు.
కాగా, ఈ సందర్భంగా వధూవరులు ఒకరి మెడలో మరొకరు పెళ్లి దండలు వేసుకున్నారు. అనంతరం పెళ్లికొడుకు అందరి ముందు పెళ్లికుమార్తెకు ముద్దు పెట్టాడు. దీనిపై ఆ యువతి ఆగ్రహం చెందింది. వెంటనే వేదిక నుంచి వెళ్లిపోయింది. వరుడి క్యారెక్టర్పై ఆమె అనుమానం వ్యక్తం చేసింది. స్నేహితులతో పందెం వేసుకుని అందరి ముందు తనను ముద్దు పెట్టుకున్నాడని ఆరోపించింది. అతడితో జరిగిన పెళ్లిని రద్దు చేయాలని తల్లిదండ్రులను డిమాండ్ చేసింది.
అంతటితో ఆగని ఆ వధువు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి వరుడిపై ఫిర్యాదు చేసింది. తొలుత అతడు తనను అనుచితంగా తాకాడని ఆరోపించింది. అయితే తాను పట్టించుకోలేదని చెప్పింది. ఆ తర్వాత చాలా మంది అతిథుల ముందు తనను ముద్దుపెట్టుకుని అవమానించాడని విమర్శించింది. తన ఆత్మ గౌరవాన్ని పట్టించుకోక అతడు దురుసుగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది.
మరోవైపు ఆ జంట పెళ్లి తంతు పూర్తికావడంతో వధువుకు నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆమె వారి మాటను వినలేదు. అతడితో జరిగిన పెళ్లిని రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టింది. చివరకు వరుడిపై కేసు నమోదు చేయడంతో ఎవరి ఇంటికి వారు చేరుకున్నారు.
కాగా, స్నేహితులు రెచ్చగొట్టడం వల్ల వరుడు అలా ప్రవర్తించాడని వధువు తల్లి తెలిపింది. తమ కుమార్తెకు నచ్చజెప్పేందుకు తాము ఎంతో ప్రయత్నించినట్లు చెప్పింది. తమ మాట వినక పెళ్లి రద్దు చేయాలని పట్టుబట్టిందని తెలిపింది. ఈ నేపథ్యంలో తమ కుమార్తె కోపం తగ్గేందుకు కొన్ని రోజులు వేచి ఉండాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయని వధువు తల్లి వెల్లడించింది.
మరోవైపు ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్, లఖింపూర్ ఖేరీలో కూడా వధువులు తమ వివాహాలను రద్దు చేసుకున్నారు. పెళ్లిలో వరులు నాగిని డ్యాన్స్ చేయడంపై ఆగ్రహించి ఈ నిర్ణయం తీసుకున్నారు.