జైపూర్: కరోనా టీకా వేసేందుకు వచ్చిన వైద్య సిబ్బందిని ఒక మహిళ పాముతో బెదిరించింది. రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పిసాంగన్ ప్రాంతంలోని నాగెలావ్ గ్రామంలో ఇంటింటికి కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించారు. పాములను పట్టి ఆడించే కమలా దేవి ఇంటికి వైద్య సిబ్బంది వెళ్లగా టీకా తీసుకునేందుకు ఆమె నిరాకరించింది. వైద్య సిబ్బంది నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా బుట్టలో నుంచి ఒక పామును తీసింది. తన ఇంటి నుంచి వెళ్లకపోతే పామును వారిపైకి విసురుతానని ఆమె హెచ్చరించింది.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కమలా దేవి ఇంటికి వచ్చారు. దీంతో వైద్య సిబ్బంది స్థానికుల సహాయం కోరారు. వారంతా ఆమెకు నచ్చజెప్పారు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. దీంతో దిగి వచ్చిన కమలా దేవి చివరకు టీకా వేయించుకున్నది. ఆమె తర్వాత స్థానికంగా ఉన్న 20 మంది కూడా వ్యాక్సిన్ పొందారు.