నిధులు మురిగిపోవడం చూసుంటాం. వస్తువులు మురిగిపోవడం చూసుంటాం. కానీ కరోనా వ్యాక్సిన్లు మురిగిపోయాయి. నిజం. దేశంలో ఇప్పుడు అత్యావశ్యకం, అమృతంతో సమానమైనది కరోనా వ్యాక్సిన్. ఇంతటి ప్రాధాన్యం గల వ్యాక్సిన్ కొన్ని రాష్ట్రాల్లో మురిగిపోతోంది. బీజేపీ పాలిత రాష్ట్రమైన యూపీలోనే ఇలా అత్యధికంగా మురిగిపోయింది. కరోనా వ్యాక్సిన్లను ముఖ్యంగా ఐదు రాష్ట్రాలు సరిగా ఉపయోగించుకోవడం లేదని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ గణాంకాలే పేర్కొంటున్నాయి.
కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ డేటా ప్రకారం ఐదు రాష్ట్రాలు వ్యాక్సిన్లను సరిగా ఉపయోగించుకోవడం లేదని తేలింది. అందులో మొదటి స్థానం యోగి నేతృత్వంలోని యూపీదే. ఆ తర్వాత మహారాష్ట్ర, బెంగాల్, బిహార్, రాజస్థాన్ రాష్ట్రాలున్నాయి. యూపీలో అత్యధికంగా 2.9 కోట్ల వ్యాక్సిన్లు మురిగిపోయాయట. బెంగాల్ లో 2.5 కోట్లు, మహారాష్ట్రలో 2.2 కోట్లు, బిహార్లో 1.80 కోట్లు, రాజస్థాన్లో 1.4 కోట్లు, తమిళనాడులో 1.35 కోట్లు, మధ్యప్రదేశ్లో 1.1 కోట్ల వ్యాక్సిన్లు అలాగే ఉండిపోయాయి.
ఇక.. మొదటి డోసును కూడా తీసుకోని ప్రజలు సైతం ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నారని ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. ఉదాహరణకు తీసుకుంటే యూపీ. దేశంలోనే పెద్ద రాష్ట్రం. అక్కడ 3.50 కోట్ల మంది ఇంకా మొదటి డోసునే తీసుకోలేదు. బిహార్లో 1.89 కోట్ల మంది, మహారాష్ట్రలో 1.71కోట్లు, తమిళనాడులో 1.24 కోట్ల మంది ఇంకా మొదటి డోసును తీసుకోలేదని ఆ గణాంకాల్లో తేలింది.