భోపాల్: మాస్టర్స్ డిగ్రీ విద్యార్థుల పరీక్షల కోసం టైమ్టేబుల్, అడ్మిట్ కార్డులను యూనివర్సిటీ (Jabalpur university) జారీ చేసింది. అయితే పరీక్షలు నిర్వహించడం మరిచిపోయింది. దీంతో పరీక్షల కోసం వచ్చిన విద్యార్థులు ఈ విషయం తెలిసి షాక్ అయ్యారు. ఎగ్జామ్స్ అధికారి నిర్లక్ష్యంపై నిరసనకు దిగారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఈ సంఘటన జరిగింది. రాణి దుర్గావతి యూనివర్శిటీ ఎంఎస్సీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల కోసం ఫిబ్రవరిలో టైమ్టేబుల్ ప్రకటించింది. విద్యార్థులకు అడ్మిట్ కార్డులు కూడా జారీ చేసింది.
కాగా, మంగళవారం నుంచి ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. సమీప జిల్లాలకు చెందిన విద్యార్థులు పరీక్ష రాసేందుకు ఆ యూనివర్సిటీకి చేరుకున్నారు. అయితే పరీక్షల నిర్వహణ గురించి సిబ్బంది మరిచిపోయారు. ఈ విషయం తెలిసి విద్యార్థులు షాక్ అయ్యారు. వైస్ ఛాన్స్లర్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు పరీక్షల నిర్వహణకు బాధ్యులైన ఇద్దరు సిబ్బంది మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని వైస్ ఛాన్స్లర్ ఆదేశించారు. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరీక్షల నిర్వహణ విషయం మరిచిన సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ కోసం కమిటీని ఏర్పాటు చేసినట్లు రిజిస్ట్రార్ డాక్టర్ దీపేష్ మిశ్రా తెలిపారు. కొత్త టైమ్టేబుల్ జారీ చేశామని, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ మొదటి సెమిస్టర్ పరీక్షలు మార్చి 7 నుంచి 15 వరకు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.