న్యూఢిల్లీ: రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ (Sanjay Seth) మొబైల్ ఫోన్కు బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఆగంతకులు రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి సంజయ్ సేథ్ దీని గురించి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం సాయంత్రం రూ. 50 లక్షల దోపిడీకి సంబంధించిన బెదిరింపు సందేశం వచ్చిందని ఆయన ధృవీకరించారు. ఆ వెంటనే ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారిని కలిసి దీని గురించి చెప్పానన్నారు. డీసీపీ, ఇతర సీనియర్ పోలీస్ అధికారులు ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నారని శనివారం వెల్లడించారు. అలాగే జార్ఖండ్ డీజీపీ అనురాగ్ గుప్తాతో కూడా స్వయంగా మాట్లాడి ఫిర్యాదు చేసినట్లు వివరించారు.
కాగా, ఇలాంటి బెదిరింపులపై వీలైనంత త్వరగా స్పందించాలని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ తెలిపారు. ‘ఈ విషయాన్ని రిపోర్ట్ చేయడం నా బాధ్యత. నేను అలా చేశా. ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వం నుంచి ప్రేరణ పొందా. నా పనిపై, ప్రాంతాలను సందర్శించడం, ప్రజలను కలవడంపై దృష్టి పెడుతున్నా. ఎప్పటిలాగే పోలీసులు తమ పనిని సమర్థవంతంగా చేస్తున్నారు’ అని అన్నారు.