Oscars | న్యూఢిల్లీ, మార్చి 14: దేశంలో ఎవరు ఏ ఘనత సాధించినా అదంతా మోదీ వల్లే జరిగిందని గప్పాలు కొట్టుకునే బీజేపీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్కు లభించిన ఆస్కార్ అవార్డును కూడా తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నది. సినిమా విడుదలకు ముందు థియేటర్ల మీద దాడులు చేస్తామని హెచ్చరించిన పార్టీనే ఇప్పుడు క్రెడిట్ కొట్టేసేందుకు ప్రయత్నిస్తూ నవ్వులపాలవుతున్నది. రచయిత విజయేంద్ర ప్రసాద్ను రాజ్యసభకు పంపడాన్ని ఇందుకు ఉపయోగించుకుంటున్నది.
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చేసిన ఓ ప్రకటనపై నెటిజన్లు మండిపడ్డారు. రాజ్యసభకు ప్రధాని మోదీ సరైన సభ్యులను ఎంపిక చేస్తారనడానికి ఆర్ఆర్ఆర్ అస్కార్ అవార్డు గెలవడమే నిదర్శనమని ఆయన ప్రకటించారు. ఈ మాటలకు నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్ సినిమాలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. పాటను లిరిక్ రైటర్ రాస్తారు. స్క్రిప్ట్ రైటర్ కాదు. ఈ విషయం కూడా కేంద్రమంత్రి తెలియదు.’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
మరో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా పరోక్షంగా ఆస్కార్ అవార్డును తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించారు. ప్రధాని మోదీ ‘లోకల్ టూ గ్లోబల్’ అంటారని, ఇదే విధంగా ఇప్పుడు మన ప్రాంతీయ సినిమా అంతర్జాతీయంగా మారి, అతిపెద్ద విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో భారతీయ చిత్రాల ప్రదర్శనకు ప్రభుత్వం సహకరిస్తున్నదని చెప్పుకున్నారు.
రాజ్యసభ మంగళవారం ఆస్కార్ విజేతలకు అభినందనలు తెలియజేసింది. ఈ క్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గే చేసిన కామెంట్స్ నవ్వులు పూయించడంతో పాటు బీజేపీ వైఖరికి అద్దం పట్టాయి. ఆస్కార్ క్రెడిట్ను బీజేపీ తీసుకోవద్దని, దయచేసి ప్రధాని మోదీనే ఈ సినిమాకు దర్శకత్వం వహించారని, ఆయనే పాట రాశారని మాత్రం చెప్పవద్దు అంటూ ఆయన బీజేపీ ఎంపీలకు చురకలు అంటించారు. ఖర్గే మాటలకు కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు కూడా ఒక్కసారిగా నవ్వడం కనిపించింది.