Hardeep Puri : పశ్చిమ బెంగాల్ పోలీసులు పాలక పార్టీకి వత్తాసు పలుకుతున్నారని రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్ధితి దిగజారిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం ఆరోపించారు. షాజహాన్ షేక్ను సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు ఉత్తర్వులను తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ పెడచెవిన పెట్టడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్ర పోలీసులు పూర్తిగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు.
సందేశ్ఖలి ఘటనలో 55 రోజులైనా షాజహాన్ను అరెస్ట్ చేయకపోవడం దారుణమని అన్నారు. షాజహాన్ను అప్పగించకుండా ఈ కేసు కేంద్ర దర్యాప్తునకు వెళ్లరాదని చెబుతున్నారని ఆరోపించారు. షాజహాన్ షేక్ వ్యవహారానికి టీఎంసీ రాజకీయ రంగు పులుముతోందని అన్నారు. నిందితుడు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్కు వెళ్లడం తాను తొలిసారి చూస్తున్నానని చెప్పారు.
సీబీఐకి దర్యాప్తును అప్పగించాలన్న కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించడం ఇదే తొలిసారని మంత్రి పేర్కొన్నారు. సందేశ్ఖలి కేసులో భూఆక్రమణలు, బెదిరింపులు, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న షాజహాన్ షేక్ను బుధవారం సాయంత్రం లోగా సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు రాష్ట్ర సీఐడీని ఆదేశించింది.
Read More :